యాప్నగరం

పాక్ అలా చేయకపోతే, మేమే రంగంలోకి దిగుతాం... సీఐఏ!

తమ భూభాగంలో తీవ్రవాద శిబిరాలు, వారి కార్యకలాపాలపై పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగుతామని అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో ఘాటుగా హెచ్చరించారు.

TNN 4 Dec 2017, 4:01 pm
తమ భూభాగంలో తీవ్రవాద శిబిరాలు, వారి కార్యకలాపాలపై పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగుతామని అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో ఘాటుగా హెచ్చరించారు. అమెరికా రక్షణ శాఖ సెక్రెటరీ జేమ్స్ మట్టీస్ పాకిస్థాన్ పర్యటనకు రెండు రోజుల ముందే సీఐఏ డైరెక్టర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన పర్యటనలో మట్టీస్ ఈ విషయంపై పాక్‌కు ముందు నెమ్మదిగా తెలియజేస్తారని అన్నారు. ఉగ్రవాద శిబిరాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తమ అధ్యక్షుడు ట్రంప్ మాటగా పాకిస్థాన్ ప్రభుత్వానికి ఆయన విన్నవిస్తారని పాంపియో పేర్కొన్నారు.
Samayam Telugu if pakistan doesnt act well ensure terror safe havens dont exist says cias director
పాక్ అలా చేయకపోతే, మేమే రంగంలోకి దిగుతాం... సీఐఏ!


ఈ విషయంలో పాక్ ఉదాసీనంగా వ్యవహరిస్తే, మేము చేయాల్సిన పని మేము చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాలిఫోర్నియాలోని సిమి వేదికగా జరిగిన రీగాన్ నేషనల్ డిఫెన్స్ ఫోరమ్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకుంటామని చేసిన వాగ్దానాన్ని పాకిస్థాన్ నిలబెట్టుకుంటుందని భావిస్తున్నామని పాంపియో అన్నారు. ఈ సమస్యపై ఒక్కరిగా కాకుండా, కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన తెలియజేశారు. డిఫెన్స్ సెక్రెటరీ మట్టీస్ సోమవారం పాకిస్థాన్ చేరుకుని, ఆర్మీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా అఫ్గనిస్థాన్ పునర్నిర్మాణం, ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక అంశాల గురించి చర్చించనున్నారు.

హక్కానీ ఉగ్రవాద సంస్థ లాంటి ఆఫ్గన్ తాలిబన్లకు పాకిస్థాన్ రక్షణ కల్పిస్తోందని... ఈ తీవ్రవాదులు ఆఫ్గన్‌లోని పౌరులు, అమెరికా సైనికులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని గత కొన్నేళ్లుగా అమెరికా ఆరోపిస్తోంది. ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం కల్పించడం వల్లే ఆఫ్గన్‌లోని తమ సైనికులపై వారు దాడులకు పాల్పడుతున్నారని, తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గత ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలకు అమెరికా బిలియన్ల కొద్ది డాలర్లు పాక్‌కు కుమ్మరిస్తున్నా ఎలాంటి మార్పు లేదని, వారిపై తక్షణమే చర్యలకు ఉపక్రమించాలని గత ఆగస్టు 21 న ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.