యాప్నగరం

శాంతి చర్చలను ప్రారంభిద్దాం.. మోదీకి ఇమ్రాన్ ఖాన్ లేఖ

ఇరు దేశాల మధ్య శాంతి చర్చలను తిరిగి ప్రారంభిద్దామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Samayam Telugu 20 Sep 2018, 8:06 am
ఇరుదేశాల మధ్య శాంతి చర్చలను పునః ప్రారంభించాలని కోరుతూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ముఖ్యంగా విదేశాంగ మంత్రులు సుష్మా స్వరాజ్, షా మహ్మద్ ఖురేషీ మధ్య చర్చలు జరగాలని ఆయన కోరారు. ఈ నెలలో జరగనున్న ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వీరిద్దరూ భేటీ కావాలని ఆయన ఆకాంక్షించారు. అర్థవంతమైన, నిర్మాణత్మక చర్చలకు సిద్ధమని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో దానికి బదులుగా ఇమ్రాన్ ఖాన్ ఈ లేఖ రాశారు.
Samayam Telugu imran modi


ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు భారత్ ఒక అడుగు ముందుకేస్తే.. మేం రెండు అడుగులు ముందుకేస్తామని ప్రకటించారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో సుష్మా, ఖురేషీ భేటీ అవుతారా లేదా అనే విషయమై గత కొద్ది వారాలుగా రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరాక.. సంబంధాల పునరుద్ధరణ కోసం ఇరుదేశాల నుంచి వెలువడిన తొలి ప్రతిపాదన ఇమ్రాన్ ఖాన్ లేఖే కావడం విశేషం.

హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు కోసం 2015 డిసెంబర్లో సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ వెళ్లారు. అవే పాక్‌తో భారత్ జరిపిన చివరి చర్చలు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి తర్వాత దాయాది దేశంతో భారత్ ద్వైపాక్షిక చర్చలను నిలిపేసింది. కశ్మీర్, ఉగ్రవాదం సహా అన్ని సమస్యలను భారత్, పాక్‌లు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఖాన్ ఆకాంక్షించారు.

ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి రావడానికి పాకిస్థాన్ ఆర్మీ సహకరించింది. అందువల్ల పాక్ వైఖరిలో మార్పు వస్తుందని ఆశించలేమని కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇమ్రాన్ నుంచి ఈ లేఖ రావడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.