యాప్నగరం

పెరల్ హార్బర్‌లో కాల్పులు... ఐఏఎఫ్ చీఫ్ భదౌరియాకు త్రుటిలో తప్పిన ముప్పు

అమెరికాలోని పెరల్ హార్బర్‌పై దాడి ఘటన రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఆ ఘటనకు 78 ఏళ్లు పూర్తవుతుండగా అమెరికా నేవీ ఉద్యోగే కాల్పులు జరపడంతో కలకలం రేగింది.

Samayam Telugu 5 Dec 2019, 11:51 am
అమెరికాలోని హవాయిలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్‌ మార్షల్‌ రాకేశ్ కుమార్‌ సింగ్‌ భదౌరియాకు త్రుటిలో తప్పించుకున్నారు. పెరెల్‌ హార్బర్‌ నేవీ షిప్‌యార్డ్‌లో ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడిన సమయంలో భదౌరియా బృందం కూడా అక్కడే ఉంది. అయితే ప్రమాదం నుంచి వారంతా సురక్షితంగా బయటపడినట్లు ఐఏఎఫ్‌ వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Samayam Telugu rkb


నేవీ బేస్‌లోకి చొరబడిన ఓ ఆగంతకుడు అక్కడి సిబ్బందిపై తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో డిఫెన్స్‌ సివిలియన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ముగ్గురు గాయపడగా, వీరిలో ఇద్దరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. నిందితుడి కూడా అమెరికా నౌకాదళానికి చెందిన నావికుడే కావడం గమనార్హం. పెరెల్ హార్బర్‌లోని ఎయిర్‌బేస్‌‌లో ఇండో-పసిఫిక్ ప్రాంత ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్స్‌ సదస్సు జరుగుతోంది.

ఈ సదస్సులో భారత్‌ నుంచి చీఫ్‌ మార్షల్‌ భదౌరియా సహా వాయుసేన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాల్పులు జరిగిన సమయంలో వీరంతా అక్కడే ఉన్నారు. అయితే ప్రమాదంలో వీరికి ఎలాంటి హానీ జరగలేదని ఐఏఎఫ్‌ తెలిపింది. పెరెల్ హార్బర్‌ అమెరికాలో అత్యంత లోతైన నౌకాశ్రయం. ఇది అమెరికా పసిఫిక్ నౌకాదళం ప్రధాన కార్యాలయం. ఇక్కడ 15 జలాంతర్గాములు, 10 నౌకవిధ్వంసక వాహనాలు ఉంటాయి. అంతేకాదు, 1941 డిసెంబరు 7న జపాన్ ఈ హార్బర్‌పై దాడిచేయడంతోనే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ దాడిలో 2,300 మందిపైగా చనిపోయారు.

హవాయ్ గవర్నర్ డేవిడ్ జే మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఫెడరల్ ఏజేన్సీను ఉపయోగించుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారని, ఎలాంటి సాయమైనా చేస్తామరని భరోసా ఇచ్చారని అన్నారు. పెరల్ హార్బర్‌పై దాడి ఘటనకు వచ్చే శనివారంతో 78 ఏళ్ల పూర్తికానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.