యాప్నగరం

పెళ్లికి ముందు శృంగారం.. ఏడాది జైలు శిక్ష

Indonesia criminal code: పెళ్లికి ముందు శృంగారం, సహజీవనంపై ఇండోనేషియా ప్రభుత్వం నిషేధం విధించింది. భర్త లేదా భార్య కానీ వ్యక్తులతో శృంగారంలో పాల్గొంటే వారిని వ్యభిచారం కింద శిక్షిస్తామని స్పష్టం చేసింది. ఏడాది జైలు శిక్ష లేదా భారీ జరినామా విధించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఇండోనేషియా ప్రభుత్వం క్రిమినల్ ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. డిసెంబర్ 15న ఈ ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. విదేశీయులకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 31 Dec 2022, 2:35 pm
భర్త లేదా భార్య కాని వ్యక్తులతో శృంగారంలో పాల్గొంటే ఏడాది జైలు శిక్షతో పాటు భారీ జరినామా విధించేందుకు ఇండోనేషియా ప్రభుత్వం సిద్ధమైంది. పెళ్లికి ముందు శృంగారం, సహజీవనంపై నిషేధం విధించనుంది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా కఠిన చర్యలు తీసుకోనుంది. వీటన్నింటినీ వ్యభిచారం కింద పరిగణించి శిక్షిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఇండోనేషియా పౌరులతో పాటు తమ గడ్డపై విదేశీయులకు కూడా వర్తిస్తాయని ఆ దేశ న్యాయ శాఖ ఉప మంత్రి ఎడ్వర్డ్‌ ఒమర్‌ షరీఫ్‌ హియరిజ్‌ తెలిపారు. ‘ఇండోనేషియా విలువలకు అనుగుణంగా ఈ క్రిమినల్ కోడ్‌ను తీర్చిదిద్దినందుకు మేం గర్విస్తున్నాం’ అని రాయిటర్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ఈ ముసాయిదా బిల్లుకు ఇండోనేషియా ప్రభుత్వం డిసెంబర్ 15న ఆమోదం తెలిపింది. త్వరలో అమల్లోకి రానుంది.
Samayam Telugu Living Relationship
ప్రతీకాత్మక చిత్రం


ప్రభుత్వ సిద్ధాంతాలు, విలువలకు వ్యతిరేకంగా దేశాధ్యక్షుడు లేదా దేశ అత్యున్నత సంస్థలను కించపరిచేవిధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఈ ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. సుదీర్ఘ సంప్రదింపులు, మానవ హక్కుల సంఘంతో భేటీ అనంతరం ఈ కొత్త క్రిమినల్ చట్టాన్ని రూపొందించారు.

‘పెళ్లికి ముందు శృంగారం, సహజీవనం చేయడం నిషేధం. భార్య/ భర్త లేనివారితోనూ ఎవరైనా శృంగారంలో పాల్గొంటే.. వారిని వ్యభిచారం కింద శిక్షిస్తాం’ అని ముసాయిదాలో పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేసియా. ఇక్కడ మహిళలు, మతపరమైన మైనారిటీలు, స్వలింగ సంపర్కులపై పలు ఆంక్షలు ఉన్నాయి. వీటికి ఇస్లామిక్ సంస్థల మద్దతు ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఆంక్షలపైనా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైనా అక్కడి ప్రభుత్వం అణచివేసింది.

ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుహార్తో (Suharto) హయాంలో ఉదారవాద సంస్కరణలను తీసుకొచ్చారు. 1998లో ఆయన మరణం తర్వాత సంప్రదాయవాదం పెరిగింది. సుహార్తో ఆశయాలకు వ్యతిరేకంగా ఇండోనేషియా పాలకులు వ్యవహరిస్తున్నారని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

వాస్తవానికి ఈ చట్టం 2019లోనే ఆమోదం పొందాల్సి ఉంది. కానీ, దీనికి వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ కొత్త చట్టం పౌర స్వేచ్ఛను అణచివేసేలా ఉందంటూ వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. దీంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గి.. ప్రజలు, మేధావులతో చర్చలు జరిపి కొన్ని మార్పులతో నూతన చట్టాన్ని తీసుకొస్తోంది.

7వ తరగతి విద్యార్థినిపై క్లాస్ రూమ్‌లోనే.. ముంబైలో హయత్‌నగర్ తరహా దారుణం
ఒక్కసారి వెళ్తే 6 సార్లు టోల్ ఛార్జీ కట్.. ఇదేం మోసం? ఇది గమనించారా?
Read Latest National News and Telugu News
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.