యాప్నగరం

అరుణాచల్ వివాదంలో జపాన్ తలదూర్చొద్దు: చైనా

అరుణాచల్ ప్రదేశ్‌లో జపాన్ పెట్టుబడులు పెట్టడాన్ని చైనా ఖండించింది. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదంలోకి మరో దేశం తలదూర్చ వద్దని ఘాటుగా హెచ్చరించింది.

TNN 15 Sep 2017, 5:16 pm
భారత్-చైనా సరిహద్దు వివాదంలో మూడో దేశం జోక్యాన్ని సహించబోమని చైనా శుక్రవారం ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ముందుకు వచ్చిన నేపథ్యంలో డ్రాగన్ ఈ వ్యాఖ్యలు చేసింది. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా పేర్కొంటున్న చైనా.. అది తమ దేశంలో భాగమని వాదిస్తోన్న సంగతి తెలిసిందే. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం ఉంది. తూర్పు ప్రాంతంలో స్పష్టంగా సరిహద్దులను గుర్తించలేదు. ఇరు పక్షాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్ తెలిపారు.
Samayam Telugu japan should not get involved in china india row beijing
అరుణాచల్ వివాదంలో జపాన్ తలదూర్చొద్దు: చైనా


వివాద పరిష్కారానికి కృషి చేస్తున్న సమయంలో మరో దేశం కచ్చితంగా జోక్యం చేసుకోకూడదు. భారత్ కూడా దీన్ని గౌరవిస్తుందని అనుకుంటున్నామని హువా వ్యాఖ్యానించారు. దక్షిణ చైనా సముద్రం సహా పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా నౌకాయనం గురించి భారత్, జపాన్ చర్చించాయి. ఈ విషయంపై కూడా చైనా ఘాటుగా స్పందించింది. దక్షిణ చైనా సముద్రంపై ఆ దేశాలకు ఎలాంటి హక్కులు లేవని ప్రకటించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆ వివాదం సంబంధం ఉన్న దేశాలతో పరిష్కారం చేసుకుంటామని హువా తెలిపారు.

జమ్మూ కశ్మీర్లోని 38 వేల చ.కి.మీ. భూభాగాన్ని ఆక్రమించిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌లోని 90 వేల చ.కి.మీ ప్రాంతం తనదని వాదిస్తోంది. గతంలో అమెరికా రాయబారి తవాంగ్‌లో పర్యటించగా.. దాన్ని ఖండించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.