యాప్నగరం

వాలంటీర్‌కు అనారోగ్యం.. నిలిచిన మరో వ్యాక్సిన్‌ ప్రయోగాలు

Johnson & Johnson: కరోనా వ్యాక్సిన్‌పై పోరు కొనసాగుతున్న వేళ మరో నిరాశజనక ప్రకటన వచ్చింది. వాలంటీర్‌కు అంతుచిక్కని అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మూడో దశ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపేస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ప్రకటించింది.

Samayam Telugu 13 Oct 2020, 6:57 pm
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా పరిశోధనలు సాగిస్తుండగా మరో నిరుత్సాహానికి గురిచేసే వార్త బయటకి వచ్చింది. వైరస్‌ను అరికట్టేందుకు అభివృద్ధి చేస్తున్న మరో వ్యాక్సిన్‌‌ క్లినికల్‌ ట్రయల్స్‌ తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఆ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వాలంటీర్‌ అనారోగ్యానికి గురికావడమే అందుక్కారణం. వాలంటీర్‌లో అంతుచిక్కని అనారోగ్య సమస్య తలెత్తడంతో క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రముఖ సంస్థ ‘జాన్సన్ అండ్ జాన్సస్’ ఒక ప్రకటన విడుదల చేసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Johnson and Johnson clinical trials (Representational Image)


మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకున్న వ్యాక్సిన్లలో అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్ ఒకటి కావడం గమనార్హం. ఇప్పటికే రెండు దశల ప్రయోగాల్లో ఆశాజనక ఫలితాలు వచ్చినట్లు కంపెనీ సెప్టెంబర్‌లో ప్రకటించింది. మూడో దశను కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజా ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఆక్స్‌ఫర్ట్ టీకా తరహాలోనే..
ఆక్స్‌ఫర్డ్‌ (Oxfored), ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ కూడా ఇదే తరహాలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా ఆశలు రేపిన తరుణంలో క్లినికల్ ట్రయల్స్ నిలిపేస్తున్నట్లు సెప్టెంబర్‌లో వచ్చిన ప్రకటన తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. అయితే.. ఎలాంటి ఇబ్బందులు లేవని తేలడంతో ప్రయోగాలను తిరిగి ప్రారంభించారు.

Must Read: ఆరోగ్య సేతు యాప్‌పై WHO ప్రశంసలు

జాన్సన్ అండ్ జాన్సన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో తలెత్తిన సమస్యపై ఇండిపెండెంట్‌ పేషెంట్‌ సేఫ్టీ కమిటీ లోతైన సమీక్ష జరపనున్నట్లు ఆ సంస్థ తన ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు కంపెనీకి చెందిన క్లినికల్‌ సేఫ్టీ ఎక్స్‌పర్ట్స్ కూడా పరీక్షిస్తారని వెల్లడించింది. వారి నివేదికల ఆధారంగా క్లినికల్ ట్రయల్స్‌పై తదుపరి చర్యలు కొనసాగిస్తామని తెలిపింది.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది వాలంటీర్లపై టీకాను ప్రయోగించనున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ గతంలో తెలిపింది. దీనికి ఇప్పటికే నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. ఈ టీకా తీసుకున్న ఓ వ్యక్తిలో ఇటీవల వివరించలేని అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు గుర్తించడంతో ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతా ప్రమాణాల ప్రకారమే ఈ చర్య తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది.

Also Read: 16 ఏళ్లకే గర్భం.. మట్టిలో కలిసిన పరువు, ప్రాణం; జగిత్యాలలో విషాదం

Don't Miss: అంబులెన్స్‌ డ్రైవర్: వందలాది కరోనా రోగులను కాపాడి వైరస్‌తో మృతి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.