యాప్నగరం

కరోనా ఆఫర్... వైరస్ ఎక్కించుకుంటే రూ.3 లక్షలు

ఆరోగ్యంగా ఉన్న కొంతమందిని పలు బ్యాచ్‌లుగా విభజిస్తున్నారు. వారికి కరోనా వైరస్ ఎక్కిస్తారు. అయతే ఈ వైరస్‌ను ఎవరైనా తమ శరీరంలోకి ఎక్కించుకుంటే వారికి ముందుగా శ్వాసపరమైన సమస్యలు తలెత్తుతాయి.

Samayam Telugu 11 Mar 2020, 12:44 pm
ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి తో యావత్ ప్రపంచం వణికిపోతుంది. మరోవైపు సైంటిస్టులు ఆ వ్యాధికి మందు కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. చైనాలా కాస్త తగ్గుముఖం పట్టిన వైరస్... ఇప్పుడు ఇటలీలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి 60కు పైగా మంది మృతిచెందినట్లు సమాచారం. మరోవైపు భారత్‌లో కూడా రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా కలకలం రేపుతోంది. నెల్లూరులో ఇటలీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా లక్షణాలు ఉండటంతో అతడ్ని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా కేంద్రం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఎందుకంటే ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులను కేంద్రసర్కార్‌ అధికారికంగా ప్రకటిస్తుంది.
Samayam Telugu coronovirus


మరోవైపు కరోనా వైరస్ గురించి అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు పరిశోధనల్లో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌లో దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సైంటిస్టులంతా ఎంతో కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో లండన్ సైంటిస్టులు ఓ ఆఫర్ ప్రకటించారు. కరోనా జాతికి చెందిన ఓసీ43, 229ఈ వైరస్‌లపై ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తలు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎవరైనా ఈ వైరస్ శరీరంలోకి ఎక్కించుకుంటే... వారికి రూ. 3 లక్షల బహుమతి ఇస్తామని చెబుతున్నారు. అయితే లండన్ సైంటిస్టులు ఇచ్చిన ఈ ప్రకటనకు చాలామంది నుంచి రెస్పాన్స్ వచ్చినట్లు సమాచారం. అంతేకాదు చాలామంది వైరస్‌ను ఎక్కించుకునేందుకు తమ పేర్లను కూడా నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.

తమ పరిశోధనల కోసం ఆరోగ్యంగా ఉన్న వారిని పలు బ్యాచులుగా విభజిస్తున్నారు సైంటిస్టులు. వారికి ఈ కరోనా వైరస్‌లను ఎక్కించి, పరిశోధనలు జరుపుతారు. ఈ వైరస్‌లు ఎవరైనా తమ శరీరంలోకి ఎక్కించుకుంటే కాస్త శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అంతే తప్పా... ప్రాణాపాయం ఏమీ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. ఓవైపు కరోనా జాతికి చెందిన కొవిడ్‌-19 ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అలాంటి సమయంలో లండన్ శాస్త్రవేత్తలు ఇలాంటి ఆఫర్ ఇవ్వడంతో ఈ విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.