యాప్నగరం

పాక్‌లో బయల్పడ్డ 1300 ఏళ్లనాటి పురాతన విష్ణు దేవాలయం

ప్రకృతి రమణీయతకు మారుపేరైన స్వాత్ లోయను పాకిస్థాన్ స్విట్జర్లాండ్‌గా పిలుస్తారు. వేల ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో నాగరికత వర్ధిల్లింది. గాంధార శిల్పకళకు ఇది నిలయం.

Samayam Telugu 21 Nov 2020, 1:23 pm
పాకిస్థాన్‌లో అతి పురాతన హిందూ దేవాలయం ఒకటి బయల్పడింది. వాయువ్య పాకిస్థాన్‌లోని స్వాత్‌ జిల్లాలోని బారీకోట్‌ ఘుండాయ్‌ ప్రాంతంలో ఒక పర్వతం వద్ద పాక్‌, ఇటాలియన్‌ పురావస్తు నిపుణులు జరుపుతున్న తవ్వకాల్లో ఈ ఆలయాన్ని కనుగొన్నారు. దాదాపు 1300 ఏళ్ల క్రితం హిందూ షాహీలు నిర్మించిన విష్ణు దేవాలయమని ఖైబర్‌ పఖ్తున్ఖ్వా పురావస్తు శాఖ అధికారి ఫజల్‌ ఖలీక్‌ తెలిపారు. ఆలయ సమీపంలో కొలను, వాచ్‌టవర్‌, కంటోన్మెంట్‌ ఆనవాళ్లను కూడా కనుగొన్నట్టు వివరించారు.
Samayam Telugu స్వాత్ లోయలో హిందూ ఆలయం


ఆలయంలో దర్శనానికి వెళ్లే ముందు స్నానం కోసమే ఈ కొలను నిర్మించినట్టు భావిస్తున్నామని అన్నారు. వేలాది పురావస్తు ప్రాంతాలకు స్వాత్ జిల్లా నిలయమని ఖలీక్ వ్యాఖ్యానించారు. హిందూ షాహీల కాలం నాటి నిర్మాణాలు ఈ ప్రాంతంలో బయటపడటం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. ఈ జిల్లాలో పలు బౌద్ధ ఆరామాలు కూడా ఉన్నట్టు పురావస్తు నిపుణులు తెలిపారు.

హిందూ షాహీ లేదా కాబుల్‌ షాహీలు క్రీ.శ.850-1026 ప్రాంతంలో కాబుల్‌ లోయను పాలించిన హిందూ రాజ వంశం. వారి పాలనా కాలంలో తూర్పు అఫ్ఘనిస్థాన్‌, గాంధార (ఆధునిక పాకిస్థాన్‌), వాయువ్య భారతదేశాన్ని కాబుల్‌ లోయగా పిలిచేవారు. ఇటాలియన్ పురావస్తు మిషన్ హెడ్ డాక్టర్ లూకా మాట్లాడుతూ.. గాంధార నాగరికత, శిల్ప కళకు చెందిన ఆలయం స్వాత్ జిల్లాలో గుర్తించడం ఇదే తొలిసారని అన్నారు. ఈ ప్రాంతం బౌద్ధ ఆరామాలకు నిలయమని అన్నారు.

పాకిస్థాన్‌లోని టాప్-20 పర్యాటక ప్రాంతాల్లో స్వాత్ జిల్లా ఒకటి. ఇక్కడ సహజ అందాలు, మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక ప్రదేశాలు, పురావస్తు ప్రాంతాలకు ఇది నిలయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.