యాప్నగరం

భారత్ బద్ధ వ్యతిరేకి, మలేసియా ప్రధాని మహతీర్ రాజీనామా

మలేసియా ప్రధాని మహతీర్ మహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మలేసియా రాజుకు పంపించారు.

Samayam Telugu 24 Feb 2020, 1:37 pm
మలేసియా ప్రధాని మహతీర్ మహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాజుకు సమర్పించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. కానీ ఆయన రాజీనామాను మలేసియా రాజు అంగీకరించారో లేదో స్పష్టంగా తెలియరాలేదు. పంకతాన్ హరపన్ సంకీర్ణం నుంచి వైదొలుగుతున్నట్టు మహతిర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పర్తి బ్రిబూమి బెరసాతు మలేసియా పార్టీ తెలిపింది.
Samayam Telugu malaysia pm


పీపుల్స్ జస్టిస్ పార్టీకి చెందిన అన్వర్ ఇబ్రహీం(72)తో అభిప్రాయ బేధాలు రావడంతోనే అధికార కూటమి నుంచి వైదొలగాలని మహతీర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. తన అధికారాలను ఇబ్రహీంకు అప్పగిస్తానని మహతీర్ మాటిచ్చారు. కానీ దీనికి సంబంధించి టైం టేబుల్ ఇవ్వడానికి ఆయన సుముఖంగా లేరు.

94 ఏళ్ల మహతీర్ రాజీనామాతో పాకతాన్ హరపన్ సంకీర్ణం అధికారాన్ని కోల్పోతుంది. ప్రతిపక్షాలతో కలిసి మహతీర్ కొత్త సంకీర్ణాన్ని ఏర్పాటు చేసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. మహతీర్ 1981-2003 మధ్య మలేసియా ప్రధానిగా పని చేశారు. ఆ సమయంలో అన్వర్ మహతీర్‌కు డిప్యూటీగా పని చేశారు. కానీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమయ్యారనే కారణంతో మహతీర్ 1998లో అన్వర్‌ను పదవి నుంచి తొలగించారు. కాగా తాను గతంలో నేతృత్వం వహించిన బరిసాన్ నేషియోనల్ కూటమిపై 2018 ఎన్నికల్లో విజయం సాధించిన మహతీర్ మరోసారి ప్రధాని అయ్యారు. మలేసియా పార్లమెంట్‌లో 222 సీట్లు ఉండగా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు 112 ఓట్లు అవసరం.

మహతీర్ భారత్ వ్యతిరేక విధానాలను అవలంభిస్తారనే సంగతి తెలిసిందే. చైనా, టర్కీ, మలేసియా పాక్ మిత్ర దేశాలనే సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370ను భారత్ రద్దు చేయడం పట్ల మహతీర్ తీవ్రంగా స్పందించారు. ఐరాస వేదికగానూ భారత్‌కు వ్యతిరేకంగా గళం వినిపించారు. దీంతో మలేసియా నుంచి పామాయిల్ దిగుమతులను తగ్గించి భారత్ ఝలక్ ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.