యాప్నగరం

టర్కీ, సిరియాలో భూకంపం విలయం.. 1600 దాటిన మృతులు.. మోదీ దిగ్భ్రాంతి

టర్కీ, సిరియా దేశాల సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. గంటల వ్యవధిలోనే వరుస భూకంపాలు చోటుచేసుకోవడంతో ప్రాణనష్టం భారీగా ఉంది. ఈ విపత్తుపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయా దేశాలకు అండగా ఉంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని అన్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 6 Feb 2023, 4:38 pm

ప్రధానాంశాలు:

  • జనం గాఢనిద్రలో ఉండగా భారీ భూకంపం
  • సిరియా, టర్కీలో పెద్ద సంఖ్యలో మరణాలు
  • చలి కారణంగా సహాయక చర్యలకు ఆటంకం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Turkey Earthquake
ప్రకృతి కన్నెర్ర జేస్తే ఏమవుతుందో టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపమే నిదర్శనం. సోమవారం తెల్లవారుజామున ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన శక్తివంతమైన భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టం కాగా.. పలు నగరాలు మరుభూమిగా మారాయి. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికిపైగా మృతి చెందగా.. వేలాది సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. జనం గాఢనిద్రలో ఉండగా భూకంపం సంభవించడంతో ప్రాణనష్టం భారీగా ఉంది. వందలాది మంది నిద్రలోనే ప్రాణాలు విడిచారు.
టర్కీ భూకంప ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో స్పందించిన ప్రధాని.. ‘‘భూకంపం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరగడం బాధాకరం.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను... క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి.. టర్కీ ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుంది.. ఈ విషాదాన్ని ఎదుర్కోవటానికి అన్ని విధాలుగా ఇరు దేశాలకు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది’’ అని మోదీ ట్వీట్ చేశారు.


టర్కీ కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 4.17 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో తొలి భూకంపం చోటుచేసుకుంది. అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకారం.. ఆగ్నేయ తుర్కియేలోని గాజియాన్‌తెప్‌ ప్రావిన్సుల్లోని నుర్దగి నగరానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. దీంతో దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. టర్కీలోని దియర్‌బకీర్‌, సిరియాలోని అలెప్పో, హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.

7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన కొద్ది నిమిషాల్లో 6.7 తీవ్రతతో మరో భూకంపం నమోదయ్యింది. మొత్తం 20 సార్లు శక్తిమంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రమాద తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిరియా అధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 250 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. మరో 639 మంది గాయపడినట్లు తెలిపింది. కాగా.. రెబల్స్‌ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 47 మంది మరణించినట్లు తెలుస్తోంది. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

అటు, టర్కీలో ఇప్పటి వరకూ 290 మంది చనిపోయినట్టు ఆ దేశ ఉపాధ్యక్షుడు పౌత్ ఒక్టే తెలిపారు. అలాగే, మరో 2,300 మంది గాయపడ్డారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. శిథిలాల కింద వందలాది మంది ఇంకా చిక్కుకున్నారని పేర్కొన్నారు. విపరీతమైన చలి, మంచు వల్ల సహాయక చర్యలు ఆటంకం ఏర్పడింది. రహదారులపై మంచు పేరుకుపోయింది.

Read Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.