యాప్నగరం

అప్ఘాన్ భద్రతా దళాలకు భారత్ సాయం

భారత్, అప్ఘానిస్థాన్ మధ్య మైత్రి ఉగ్రవాదులను ఏరివేయడానికే తప్ప మరో దేశాన్ని నిర్మూలించడానికి కాదు.

TNN 11 Sep 2017, 5:58 pm
అప్ఘానిస్థాన్‌‌ రక్షణ బలగాలకు మరింత సహకారం అందించేందుకు భారత్ అంగీకరించింది. సోమవారం భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, అప్ఘాన్ విదేశాంగ మంత్రి సలహుద్దీన్ రబ్బానీ మధ్య జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అప్ఘాన్‌ భారత్‌కు అత్యంత నమ్మకమైన మిత్రదేశమని సుష్మా తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఇరు దేశాలు కలిసి పోరాడతాయని ఆమె స్పష్టం చేశారు.
Samayam Telugu ndia agrees to provide further defence assistance to afghanistan
అప్ఘాన్ భద్రతా దళాలకు భారత్ సాయం


రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరుదేశాలు అంగీకరించాయని విదేశాంగ మంత్రులిద్దరూ సంయుక్తంగా ప్రకటించారు. ఇండో అప్ఘాన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ కౌన్సిల్‌లో భాగంగా సుష్మా, రబ్బానీ సమావేశం అయ్యారు. అప్ఘాన్ రక్షణ బలగాలకు మరింత సహకారం అందించేందుకు భారత్ అంగీకరించిందని రబ్బానీ తెలిపారు. తమ దేశ రక్షణ రంగ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి భారత్ మరింత సాయం చేయాలని అప్ఘానిస్థాన్ ఎప్పటి నుంచో కోరుతోందన్నారు.

భారత్‌తో స్నేహం చేయడమంటే.. వేరే వాళ్లను నిర్మూలించడానికి కాదని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి రబ్బానీ వ్యాఖ్యానించారు. భారత్, అప్ఘాన్‌లు ఉగ్రవాద బాధిత దేశాలేనని ఆయన చెప్పారు. పాక్‌ నుంచి కార్యకలాపాలు సాగించే లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలు ఈ ప్రాంత సుస్థిరతకు ముప్పని రబ్బానీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ భేటీ సందర్భంగా ఇరుదేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే 116 నూతన అభివృద్ధి ప్రాజెక్టులను సంయుక్తంగా చేపట్టాలని భారత్, అప్ఘాన్ నిర్ణయించాయి. అప్ఘాన్‌కు రెండు బిలియన్ డాలర్ల మేర ఆర్థిక చేస్తామని భారత్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.