యాప్నగరం

అమెరికాతో చర్చలకు సిద్ధం: ఉ.కొరియా!!

అమెరికాపై ఒంటికాలిపై లేచే ఉత్తర కొరియా హఠాత్తుగా తన వైఖరిని మార్చుకుంది. అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమని సంచలన ప్రకటన చేసింది.

TNN 25 Feb 2018, 9:22 pm
అమెరికాపై ఒంటికాలిపై లేచే ఉత్తర కొరియా హఠాత్తుగా తన వైఖరిని మార్చుకుంది. అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమని సంచలన ప్రకటన చేసింది. అమెరికా ఆంక్షలు విధిస్తే దానిని తాము యుద్ధంగా పరిగణిస్తామని ప్రకటించిన ఉత్తరకొరియా కొద్ది గంటల్లోనే మాట మార్చడం విశేషం. అగ్రరాజ్యం ఆంక్షలు విధించిన కొద్దిసేపటికే తాము చర్చలకు సిద్ధమని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ కొరియాలో నిర్వహించిన వింటర్‌ ఒలింపిక్స్‌ క్రీడల ముగింపు వేడుకులకు వచ్చిన జనరల్ కిమ్ యంగ్ చోల్ నాయకత్వంలోని ఉత్తరకొరియా ప్రత్యేక బృందం అమెరికాతో సంబంధాలపై స్పందిస్తూ, శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఒలింపిక్‌ సిటీలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌‌తో కిమ్ యంగ్ చోల్ రహస్యంగా సమావేశమయ్యారు.
Samayam Telugu north korea willing to hold talks with us says south korea
అమెరికాతో చర్చలకు సిద్ధం: ఉ.కొరియా!!


ఈ సందర్భంగా అమెరికాతో కాలుదువ్వకుండా సామరస్యంగా ముందుకెళ్లాలని దక్షిణి కొరియా అధ్యక్షుడు వారికి సూచించినట్టు సమాచారం. వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా కూడా అతిథులుగా విచ్చేశారు. కానీ ఉత్తర కొరియా ప్రతినిధుల బృందంతో సమావేశం కావడానికి అమెరికా అధికారులు నిరాకరించారు. వారితో భేటీకి తమ ఉపాధ్యక్షుడు కూడా నిరాకరించినట్టు అమెరికా తెలిపింది. మరోవైపు వింటర్ ఒలింపిక్స్‌ ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు బాగా ఉపయోగపడ్డాయని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికా తాజా ఆంక్షల వల్ల దాదాపు 50కి పైగా షిప్పింగ్ కంపెనీలు, ఓడలు, వర్తక వ్యాపారాలు ప్రభావితమయ్యే అవకాశముండడంతో ఉత్తరకొరియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా వేస్తున్నారు.

కొరియా ద్వీపకల్పం 1953లో ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయిన నాటి నుంచి ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకుని ఉన్నాయి. ఇరు దేశాల మధ్య శత్రుత్వం పెరగడంతో దక్షిణ కొరియా అమెరికాకు మిత్ర దేశంగా మారింది. అయితే, ఉత్తర కొరియా ప్రకటనపై అప్రమత్తంగా ఉండాలని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినంత మాత్రాన ఉద్రిక్తతలు సమసిపోవని... ముఖ్యంగా గతేడాది అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా నిర్వహించిన విషయాన్ని విస్మరించరాదని అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.