యాప్నగరం

అమెరికా లక్ష్యంగా అణు పరీక్షలు.. ఉత్తర కొరియా అధినేత పరోక్షంగా హెచ్చరిక!

ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది మూడు నెలల్లోనే 12 వరకూ క్షిపణులను ప్రయోగించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రెండేళ్ల పాటు క్షిపణి ప్రయోగాలకు దూరంగా ఉన్న కొరియా.. వరుసగా పరీక్షలను చేపట్టడం గమనార్హం. అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు సమాచారం. ట్రంప్ హయాంలో అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుని, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకానొక దశలో ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదేమోననే ఆందోళన వ్యక్తమయ్యింది.

Samayam Telugu 28 Mar 2022, 6:08 pm
ఆయుధ సంపత్తిని పెంచుకోవడంలో తగ్గే ప్రసక్తే లేదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌ పునరుద్ఘాటించారు. ఎవరూ అడ్డుకోలేని అఖండ సైనిక శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నప్పుడే యుద్ధాన్ని నిరోధించగలమని ఆయన వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు భరోసా ఇచ్చినప్పుడే సామ్రాజ్యవాదుల బెదిరింపులను అడ్డుకోగలమని కిమ్‌ చెప్పినట్టు కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (కేసీఎన్ఏ) పేర్కొంది. ఉత్తర కొరియా శక్తివంతమై, అద్భుతమైన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటూనే ఉంటుందని, వస్తు మార్పిడి లేదా ఎవ్వరికీ విక్రయించబోదని కిమ్ స్పష్టం చేశారు.
Samayam Telugu కిమ్ జోంగ్ ఉన్
Since coming to power, Kim Jong Un has sought to modernize North Korea's military arsenal, which had previously relied on Scud variants of questionable accuracy.


గత వారం నిర్వహించిన క్షిపణి పరీక్షల్లో పాల్గొన్న అధికారులు, సైంటిస్ట్‌లు, సాంకేతిక నిపుణులు, సిబ్బందితో కిమ్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా, దాని మిత్ర రాజ్యాలకు పరోక్షంగా కిమ్‌ గట్టి హెచ్చరికలు పంపారు. నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా చేపట్టిన వేళ కిమ్‌ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

త్వరలో అణ్వస్త్ర పరీక్షను కూడా ఉత్తర కొరియా చేపట్టే అవకాశం ఉందని ఈ ప్రకటన ద్వారా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత వారం చేపట్టిన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఉత్తర కొరియా 12 పరీక్షలు నిర్వహించింది. గత శుక్రవారం ఉత్తర కొరియా ప్రయోగించిన సుదూర లక్ష్యాలను ఛేదించే హ్వాసాంగ్-17 క్షిపణిని అమెరికా ప్రధాన భూభాగంలో ఎక్కడికైనా చేరుకునేలా రూపొందించారని నిపుణులు చెబుతున్నారు.

భవిష్యత్తులో మరింత శక్తిమంతమైన క్షిపణులను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తుందని కిమ్‌ ఉద్ఘాటించారు. హ్వాసాంగ్‌-17 క్షిపణి 6,248 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని 1,090 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించింది. బహుళ వార్‌హెడ్‌లను మోసుకెళ్లేలా ఈ క్షిపణిని రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరి 67 నిమిషాల పాటు ప్రయాణించి జపాన్‌, కొరియా ద్వీపకల్పం మధ్యలోని సముద్ర జలాల్లో లక్ష్యాన్ని ఛేదించింది. నిటారుగా ఈ క్షిపణిని ప్రయోగిస్తే 15 వేల కిలోమీటర్లు వరకు ఇది వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.

ట్రంప్ హయాంలో అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుని, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఒకానొక దశలో ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదేమోననే ఆందోళన వ్యక్తమయ్యింది. అయితే, 2018లో అమెరికా, ఉత్తర కొరియా అధినేతలు చర్చలు దిశగా అడుగులు వేశారు. కానీ, నిరాయుధీకరణపై 2019లో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. మరోసారి ఎలాంటి షరతులు లేకుండా ఉత్తర కొరియా చర్చలకు రావాలని బైడెన్‌ యంత్రాంగం ఆహ్వానించింది.

అయితే ముందు తమ దేశంపై శత్రుత్వాన్ని వీడాలని ఈ సందర్భంగా అమెరికాకు ఉత్తర కొరియా స్పష్టం చేసింది. మరోవైపు, ఆయుధాలను సమకూర్చుకుంటూ అమెరికాపై ఒత్తిడి పెంచాలని ఉత్తర కొరియా వ్యూహంగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయుధ సంపత్తిని విస్తరించేందుకు చర్యలు చేపట్టిన కిమ్ త్వరలో మరో ఖండాంతర క్షిపణిని ప్రయోగించనున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.