యాప్నగరం

SCO Meet: భారత్‌ను రెచ్చగొట్టిన పాక్.. అజిత్ ధోవల్ అనూహ్య నిర్ణయం

ఇండియన్ జేమ్స్‌బాండ్‌గా పేరొందిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భేటీ నుంచి వాకౌట్ చేశారు.

Samayam Telugu 15 Sep 2020, 7:51 pm
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత్‌ను రెచ్చగొట్టేలా పాక్ ప్రవర్తించింది. ఈ వర్చువల్ మీటింగ్‌లో పాకిస్థాన్ తప్పుడు మ్యాప్‌ను ప్రదర్శించింది. దీనికి నిరసనగా భారత్ సమావేశం మధ్యలోనే వాకౌట్ చేసింది. సీఎస్ఓ భేటీకి ఆతిథ్యం ఇస్తున్న రష్యాతో చర్చలు జరిపిన తర్వాతే మన దేశం వాకౌట్ చేసింది.
Samayam Telugu Ajit-doval


‘ఇవాళ (సెప్టెంబర్ 15న) జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) ఎన్ఎస్ఏ భేటీలో పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా కల్పిత మ్యాప్‌ను ప్రదర్శించింది. ఈ విషయమై ఆతిథ్య దేశం రష్యాకు సమాచారం ఇవ్వగా.. అతిథ్య దేశ సూచనలను సైతం పాక్ పట్టించుకోలేదు. ఇది సమావేశ నిబంధనలకు విరుద్ధం. దీంతో రష్యాతో చర్చించి భేటీ మధ్యలోనే వాకౌట్’ చేశామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

పాకిస్థాన్ రెచ్చగొట్టేలా వ్యవహరించిందని.. తాము దీనికి మద్దతు ఇవ్వమని రష్యా వెల్లడించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్ చర్యను తాము సమర్థించబోమని రష్యా ఎన్ఎస్ఏ సెక్రటరీ నికోలయ్ పత్రుషేవ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

రెచ్చగొట్టేలా పాక్ వ్యవహరించిన తీరు వల్ల.. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో భారత్ పాల్గొనడంపై ప్రభావం చూపబోదని ఆశిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. తర్వాతి కార్యక్రమాల్లో భారత్ పాల్గొంటుందనే ఆశాభావం వ్యక్తం చేసింది.

ఆగస్టు 4న కొత్త పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసిన పాకిస్థాన్.. భారత్‌లోని జమ్మూ కశ్మీర్, లడఖ్‌తోపాటు గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలను తమ భూభాగాలుగా అందులో పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది పూర్తి కాబోతున్న తరుణంలో పాకిస్థాన్ ఈ మ్యాప్‌ను విడుదల చేసింది. కాగా పాక్ చర్యను భారత్ ఖండించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.