యాప్నగరం

చైనా గగనతలంలో చక్కర్లు కొట్టిన భారత డ్రోన్!

భారత సైన్యానికి చెందిన డ్రోన్ సరిహద్దులు దాటి తమ భూభాగంలోకి ప్రవేశించిందని చైనా ఆర్మీ ప్రకటించింది.

TNN 7 Dec 2017, 4:02 pm
భారత్‌కు చెందిన డ్రోన్ వాస్తవాధీన రేఖ దాటి చైనా గగన తలంలో చక్కర్లు కొట్టింది. భారత ఏరియల్ వెహికల్ తమ భూభాగంలోకి ప్రవేశించిందని చైనా మిలిటరీ ప్రకటించింది. సిక్కిం సెక్టార్లో ఈ ఘటన జరిగిందని భారత రక్షణ శాఖ కూడా ధృవీకరించింది. ఈ ఘటనను ఖండించిన డ్రాగన్, తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా, తమ డ్రోన్ చైనా గగనతలంలోకి ఎందుకు ప్రవేశించిందో భారత రక్షణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.
Samayam Telugu our drone enter chinese airspace mod
చైనా గగనతలంలో చక్కర్లు కొట్టిన భారత డ్రోన్!


‘శిక్షణలో భాగంగా ఎప్పటిలాగే ఈ డ్రోన్ భారత గగన తలంలో ఎగిరింది. కానీ కింది నుంచి ఆపరేట్ చేసే వాళ్లతో సంబంధాలను కోల్పోయి సరిహద్దులను దాటింది. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగింది. ఈ విషయమై విచారణ జరుపుతున్నాం’ అని రక్షణ వర్గాలు వెల్లడించాయి. వెంటనే ఈ విషయమై చైనా రక్షణ శాఖకు సమాచారం అందించామని తెలిపారు. దీంతో అప్రమత్తమైన చైనా మిలటరీ డ్రోన్ ఎక్కడ ఉందో గుర్తించిందని రక్షణ శాఖ వెల్లడించింది.

కాగా, ఆ డ్రోన్ ఇప్పటికీ చైనాలోనే ఉందా, లేదంటే భారత్‌కు అప్పగించారా అనే విషయంలో స్పష్టత లేదు. భారత డ్రోన్ తమ గగన తలంలోకి అక్రమంగా చొచ్చుకొచ్చిందని అంతకు ముందు చైనా ప్రకటించింది. ఈ విషయాన్ని పీఎల్ఏ అధికారులు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువాకు తెలిపారు. కానీ భారత బలగాలు సంప్రదించిన సంగతిని మాత్రం మీడియాకు చెప్పలేదు. తమ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా భారత్ వ్యవహరిస్తోందని చైనా మండిపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.