యాప్నగరం

పాక్ విదేశాంగ మంత్రి ముఖంపై సిరా పోసి నిరసన!

పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతోన్న విదేశాంగ మంత్రి ముఖంపై గుర్తుతెలియని వ్యక్తి సిరా పోసిన ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది.

TNN 11 Mar 2018, 1:45 pm
పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతోన్న విదేశాంగ మంత్రి ముఖంపై గుర్తుతెలియని వ్యక్తి సిరా పోసిన ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. పంజాబ్ ప్రావిన్సుల్లో శనివారం రాత్రి జరిగిన పార్టీ కార్యకర్తలో సమావేశంలో ప్రసంగిస్తోన్న పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్‌ ముఖంపై ఓ వ్యక్తి సిరా విసిరాడు. రాజ్యాంగ చట్టాల పేరుతో మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ ముస్లింల మనోభావలను దెబ్బతీసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని నిందితుడు ఆరోపించాడు. ఈ హఠాత్పరిణామానికి స్పందించిన మిగతా కార్యకర్తలు అతడిని పట్టుకుని దేహశుద్ది చేసి తర్వాత పోలీసులకు అప్పగించారు. సియోల్‌కోట్‌‌లో పీఎంఎల్-ఎన్ కార్యకర్తల సమావేశంలో మంత్రి ఖ్వాజా అసిఫ్‌ మాట్లాడుతుండగా, ఆయన దగ్గరగా నిలబడిన ఓ మధ్యవయస్కుడు ఊహించని విధంగా ముఖంపై సిరా పోశాడు.
Samayam Telugu pakistan foreign ministers face blackened with ink
పాక్ విదేశాంగ మంత్రి ముఖంపై సిరా పోసి నిరసన!


దీంతో వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ రక్షణగా చేరారు. అనంతరం ముఖం శుభ్రం చేసుకుని వచ్చిన అసిఫ్, తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఘటనపై ఖ్వాజా అసిఫ్ మాట్లాడుతూ... ‘అతడు ఎవరో తనకు తెలియదని...తన ప్రత్యర్థులే డబ్బులిచ్చి ఆయనతో ఇలా చేయించారని అన్నారు. కానీ అతడిని విడిచిపెట్టేయాలని పోలీసులను ఆదేశించానని, ఇలాంటి ఘటనల వల్ల తన రాజకీయ భవిత్యానికి ఇబ్బంది ఉండదని’ అన్నారు. అంతేకాదు తనకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు మంత్రిపై సిరా పోసిన వ్యక్తిని ఫయీజ్ రసూల్‌గా గుర్తించిన పోలీసులు, అతడికి ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనల పేరుతో మహ్మద్ ప్రవక్త బోధించిన విషయాలను మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ, తనతోపాటు అనేక మిలియన్ల మంది పాకిస్థానీల మనోభావాలను దెబ్బతీస్తోందని, అందుకు నిరసనగా మంత్రిపై సిరా పోసినట్ట తెలిపాడు.

మంత్రి ఆదేశాలతో అతడిని వదిలేసిన పోలీసులు, ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దైవదూషణలకు పాల్పడ్డారంటూ గత నవంబరులో న్యాయశాఖ మంత్రి జహీద్ హమిద్‌కి వ్యతిరేకంగా పాక్ అతివాద మత సంస్థలు ఉద్యమాలు చేపట్టడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ఎన్నికల చట్టం- 2017లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి తీసుకొచ్చిన మార్పులను వ్యతిరేకిస్తూ, న్యాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని అతివాద ఇస్లాం మత గ్రూపులు ఆందోళనలకు పూనుకోవడం, ఇవి తీవ్రరూపం దాల్చి హింసాత్మక ఘటనలకు దారతీశాయి. ఈ అల్లర్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.