యాప్నగరం

భారత్‌పై ప్రతిదాడికి సిద్ధపడిన పాకిస్థాన్..? ఆ ఒక్క కారణంతో వెనక్కి..!

భారత్‌కు చెందిన ఓ క్షిపణి సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్‌లోకి దూసుకెళ్లి కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్థాన్ భావించిందని బ్లూమ్‌బర్గ్ కథనం వెల్లడించింది.

Samayam Telugu 16 Mar 2022, 4:12 pm
భారత క్షిపణి పొరబాటున పాకిస్థాన్ భూభాగంలో కూలిన ఘటన ఇరు దేశాల మధ్య వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. మార్చి 9న భారత క్షిపణి పాకిస్థాన్‌‌లోని పంజాబ్ ప్రావిన్సులో కూలిన ఘటనలో ఆస్తి నష్టం వాటిల్లింది. సాంకేతిక లోపమే దీనికి కారణమని పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. కాగా, ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ బదులు తీర్చుకునేందుకు ప్రయత్నించిందని తెలుస్తోంది.
Samayam Telugu missile


భారత క్షిపణి తమ భూభాగంలోకి వచ్చినందుకు ప్రతిగా.. దాయాది దేశం కూడా మిస్సైల్‌ దాడికి సిద్ధపడిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. క్షిపణి దాడి కోసం ప్రణాళికలను సైతం రూపొందించిన పాక్.. తదుపరి పరిణామాలకు భయపడి వెనక్కి తగ్గినట్లు బ్లూమ్‌బర్గ్ కథనం తెలిపింది.

పాకిస్థాన్‌లో కూలిన భారత క్షిపణి ధ్వని వేగానికి మూడు రెట్ల వేగంతో దూసుకెళ్లి.. సరిహద్దు ఆవల 100 కిలోమీటర్ల దూరం పడిపోయింది. ఆ క్షిపణికి అణ్వాయుధ సామర్థ్యం ఉన్నప్పటికీ.. దానికి అణ్వాయుధాలను అమర్చలేదు. ఈ ఘటన పట్ల పాకిస్థాన్ ఘాటుగా స్పందించింది. ఈ క్షిపణి పొరబాటున విమానాలకు తాకితే ప్రయాణికులు, పౌరుల ప్రాణాలకు నష్టం వాటిల్లేదని.. ఈ ఘటనపై సంయుక్త విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే పర్యావసనాలను ఎదుర్కోవాల్సి వస్తుందని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తలెత్తకుండా చూడాలని భారత్‌కు పాక్ హితవు పలికింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.