యాప్నగరం

దావోస్ వేదికగా కశ్మీర్‌పై పాక్ మరోసారి వక్రభాష్యం!

కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించేందుకు పాక్ చేయని ప్రయత్నం లేదు. ప్రపంచ దేశాలు ఇందులో జోక్యం చేసుకోవాలనేది పాక్ అభిమతం.

TNN 26 Jan 2018, 2:15 pm
గతేడాది గాయాలతో ఉన్న పాలస్తీనా యువతి ఫోటోను ఐరాసలో చూపిస్తూ, కశ్మీర్‌లో భారత్‌ సైన్యం చేతిలో గాయపడిన మహిళ అంటూ ఆరోపణలు చేసింది. అయితే అసలు ఈ ఫోటో పాలస్తీనా యువతిదని తెలియడంతో పాకిస్థాన్ పరువు అంతర్జాతీయంగా గంగలో కలిసిపోయింది. అయినా సరే దాని బుద్ది మారలేదు. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని చర్చించి ప్రపంచ దేశాల ఇందులో జోక్యం చేసుకోవాలని దాయాది పాకిస్థాన్ ఎప్పటికప్పుడు పన్నాగాలు పన్నుతోంది. తాజాగా ఈ వివాదాన్ని బూచిగా చూపించి, లబ్దిపొందడానికి దావోస్ వేదికగా సాగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాక్ మరోమారు తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద సమస్యల్లో కశ్మీర్ అంశం కూడా ఒకటని వ్యాఖ్యానించింది.
Samayam Telugu pakistan rakes up kashmir rohingya muslims issues at world economic forum
దావోస్ వేదికగా కశ్మీర్‌పై పాక్ మరోసారి వక్రభాష్యం!


కశ్మీర్, రొహింగ్యాల సంక్షోభం ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయని దావోస్‌లో పాక్ ప్రధాని షాహిద్ ఖఖానీ అబ్బాసీ వక్రభాష్యం చెప్పారు. ఇవి ప్రపంచ చీలికకు కారణమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తన కేబినెట్ మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ... చైనా, అమెరికాలతోనూ తాము సత్సంబంధాలను కోరుకుంటున్నామని తెలిపారు. చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లాంటి ప్రాజెక్టుల ద్వారా ఇటీవల కాలంలో చైనాతో తమకు సంబంధాలు మెరుగుపడ్డాయని అబ్బాసీ వ్యాఖ్యానించాడు. తూర్పు, పాశ్చాత్య దేశాలతోనూ సఖ్యతగానే ఉన్నామని, భవిష్యత్తులోనూ ఆ బంధం అలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నమని అన్నారు. కశ్మీర్, రోహింగ్యాల సమస్యలపై అంతర్జాతీయంగా చర్చించాల్సి అవసరం ఉందని పాక్ ప్రధాని వ్యాఖ్యానించడం గమనార్హం.

విదేశీ పెట్టుబడుదారులకు పాకిస్థాన్ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని పాక్ ప్రధాని అన్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించి, అంతర్జాతీయంగా పాక్ ఖ్యాతిని పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు పాకిస్థాన్ ఆవిర్భావం నాటి నుంచీ చైనా, అమెరికాతో సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన ప్రతి ఆర్థిక సదస్సులోనూ చైనా చేపట్టిన కార్యక్రమాలు, దేశాధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ దృక్కోణంపై పాకిస్థాన్ ప్రశంసలు కురిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పాకిస్థాన్‌తో బంధాన్ని మా దృష్టిలోనే చూడాలని, వేరే కోణంలో చూడొద్దని మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.