యాప్నగరం

బయలుదేరి కొద్దిసేపటికే కూలిన ఫ్లైట్.. విమానంలో సిబ్బంది సహా 100 మంది

ఐదుగురు సిబ్బంది సహా 100 మందితో బయలుదేరిన విమానం రెండతస్థుల భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది. ఈ ఘటన కజకిస్థాన్‌లోని అల్మాటీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

Samayam Telugu 27 Dec 2019, 9:48 am
కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7.05 గంటలకు అల్మాటీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కూలిపోయింది. ఇందులో సిబ్బంది సహా 100 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో ఏడుగురు ఇప్పటి వరకూ చనిపోయినట్టు ధ్రువీకరించారు. అల్మాటీ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన బెక్ ఎయిర్‌ సంస్థకు చెందిన విమానం ఓ రెండంతస్థుల భవనాన్ని ఢీకొట్టి కూలిపోయిందని కజికిస్థాన్ రక్షణ శాఖ ప్రకటించింది. ఈ ఘటన ఉదయం 7.22 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలిపింది. ప్రమాదం జరిగే సమయానికి విమానంలో 95 మంది, సిబ్బంది ఐదుగురు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
Samayam Telugu kazakh


ఈ విమానం అల్మాటీ నుంచి కజికిస్థాన్ రాజధాని నూర్‌సుల్తాన్‌కు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో కొంత మంది సురక్షితంగా బయటపడ్డారని అల్మాటీ విమానాశ్రయం అధికారులు ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు. అయితే, ఖచ్చితమైన సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్‌కు సంకేతాలు నిలిచిపోవడంతో ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన టెక్నికల్ సిబ్బంది ఓ ప్రాంతంలో విమానం కూలిపోయినట్టు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం కారణంగా పలు విమానాలను రద్దుచేశారు. నివాసాల మధ్య ఈ విమానం కూలిపోవడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.