యాప్నగరం

పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి, 75 మందికి గాయాలు

రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచిన గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. పాకిస్థాన్‌లోని సాదికాబాద్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం పాలవగా.. మరి కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Samayam Telugu 11 Jul 2019, 11:25 pm
పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో ఓ ట్రాక్‌పై నిలిపి ఉంచిన గూడ్స్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం పాలవగా.. 80 మంది వరకు గాయపడ్డారు. అనధికారికంగా మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని కొన్ని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. దక్షిణ పంజాబ్‌కు చెందిన సాదిఖాబాద్‌లోని వాల్హర్‌ రైల్వేస్టేషన్‌లో గురువారం (జులై 11) ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Samayam Telugu train
పాకిస్థాన్ రైలు ప్రమాదం


పట్టాలపై నిలిపి ఉంచిన గూడ్స్‌రైలును అక్బర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. అక్బర్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చే సిగ్నల్‌లో పొరపాటు జరగడంతో అది గూడ్స్‌ రైలు నిలిపి ఉంచిన లూప్‌ లైన్‌లోకి ప్రవేశించిందని.. దీంతో ఈ ఘోరం జరిగిందని అధికారులు చెప్పారు. గాయపడిన వారిని సహాయ సిబ్బంది సమీపంలోని ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రయాణికుల మృతదేహాలు, బాధితుల ఆర్తనాదాలతో ఘటనాస్థలి భీతావహంగా మారింది. హైడ్రలిక్‌ కట్టర్‌లను ఉపయోగించి బోగీల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం పట్ల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. వరస రైలు ప్రమాదాల పట్ల విచారణ జరిపించాలని రైల్వే మంత్రిని ఆదేశించారు.

పాకిస్థాన్‌లో హైదరాబాద్‌లో జూన్‌ 20న కూడా ఇదే తరహా రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్‌ రైలు ప్యాసింజర్‌ రైలును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించగా.. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.