యాప్నగరం

పాక్ గగ్గోలు, ఇమ్రాన్ ఏడుపు మధ్యే.. ప్రధాని మోదీకి యూఏఈ అత్యున్నత పురస్కారం

PM Modi UAE Tour | భారత ప్రధాని నరేంద్ర మోదీని యూఏఈ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది. ఆర్డర్ ఆఫ్ జాయెద్‌ను శనివారం మోదీకి అందజేయనుంది. ఆర్టికల్ 370 రద్దు విషయంలో పాకిస్థాన్ గగ్గొలు పెడుతున్న తరుణంలో మోదీ ఈ పురస్కారం అందుకుంటుండటం విశేషం.

Samayam Telugu 28 Aug 2019, 2:02 pm
ఆర్టికల్ 370 రద్దు చేసిన మోదీ సర్కారు.. జమ్మూ కశ్మీర్‌ను రెండుగా విభజించి, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. ఈ చర్యతో కశ్మీరీల కంటే ఎక్కువగా పాకిస్థాన్ మనోభావాలు దెబ్బతిన్నాయి. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. భారత సైన్యం కశ్మీరీల ఆందోళనలను బలవంతంగా అణచివేస్తోందని పాకిస్థాన్ గగ్గోలు పెడుతోంది. కశ్మీర్ సరిహద్దుల్లోకి సైన్యాన్ని పంపి భారత్‌ను భయపెట్టాలనుకుంది. ఉగ్రదాడులు జరిగితే మమ్మల్ని ఏమనోద్దంటూ.. ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించాడు.
Samayam Telugu modi in uae1


పాకిస్థాన్ శాపనార్థాలను భారత్ ఏమాత్రం లక్ష్యపెట్టలేదు. కశ్మీర్ విభజన పూర్తి అంతర్గతమైందని భారత్ తేల్చి చెప్పింది. దీంతో అంతర్జాతీయంగా భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఇమ్రాన్ ఖాన్ భావించాడు. భారత్‌పై ఒత్తిడి తేద్దామంటూ ప్రవాస పాకీలకు పిలుపునిచ్చాడు. ఇస్లామిక్ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసినా.. అవన్నీ ముఖం చాటేశాయి. దీంతో ఐరాస భద్రతా మండలి రహస్య భేటీని ఏర్పాటు చేసినప్పటికీ.. ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో కశ్మీర్లో జరుగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘనను అంతర్జాతీయ న్యాయస్థానానికి నివేదిస్తామని ఇమ్రాన్ ప్రకటించాడు.

సౌదీ అరేబియా, యూఏఈ లాంటి ఇస్లామిక్ దేశాలు పాకిస్థాన్ గోడును పట్టించుకోలేదు. ప్రస్తుతం మూడు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఫ్రాన్స్ నుంచి యూఏఈ చేరుకున్నాడు. తర్వాత బహ్రెయిన్ వెళ్తున్నాడు. బహ్రెయిన్లో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం.

ప్రధాని మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా అరబ్ దేశం అత్యున్నత పౌరపురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ను అందజేయనుంది. ఆర్టికల్ 370 రద్దు చేసిన మరుసటి రోజే యూఏఈ స్పందించింది. అది భారత్ అంతర్గత వ్యవహారం అని ప్రకటించింది. భారత్, యూఏఈ మధ్య మెరుగైన స్నేహ సంబంధాలున్నాయి. పాకిస్థాన్‌తో ఆ దేశానికి మైత్రి ఉన్నప్పటికీ.. భారత్‌కు వ్యతిరేకంగా స్పందించడానికి ఇస్లామిక్ దేశం అంగీకరించడం లేదు. మోదీ విషయమై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెగ గుర్రుగా ఉన్న తరుణంలో తోటి ఇస్లామిక్ దేశమైన యూఏఈ ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందిస్తుండటం గమనార్హం.

Read Also: ప్రధాని మోదీకి యూఏఈ అత్యున్నత పురస్కారం.. ఆ నేతల సరసన మోదీ

2015 ఆగష్టులో ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించారు. 2018 ఫిబ్రవరిలో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌కు మోదీ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. 2016లో భారత్‌లో పర్యటించిన యూఏఈ యువరాజు.. మరుసటి ఏడాది రిపబ్లిక్ డే వేడుకల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.