యాప్నగరం

శ్రీలంకకు కొత్త అధ్యక్షుడు.. వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ ముందు పెద్ద ఎత్తున నిరసన

Sri Lanka new President: శ్రీలంకకు కొత్త అధ్యక్షుడు వచ్చారు. పార్లమెంట్‌లో రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఓటింగ్‌లో రణిల్ విక్రమసింఘె 134 ఓట్లతో గెలుపొందారు. అనంతరం పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 20 Jul 2022, 3:50 pm
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు కొత్త అధ్యక్షుడు (Ranil Wickremesinghe) వచ్చారు. బుధవారం (జులై 20) ఉదయం శ్రీలంక పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో యూఎన్‌పీ పార్టీ అధినేత రణిల్ విక్రమసింఘె శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రహస్య బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఈ ఎన్నికలో రణిల్ విక్రమసింఘెకు 134 ఓట్లు దక్కాయి. ప్రత్యర్థి దులస్‌ అలహాప్పెరుమాకు 82 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి అనుర కుమార 3 ఓట్లతో సరిపెట్టుకున్నారు. శ్రీలంక పాార్లమెంట్‌కు మొత్తం 225 స్థానాలున్నాయి. మెజార్టీ మార్కు కోసం కావాల్సిన సంఖ్య 113 కాాగా.. రణిల్ విక్రమసింఘెకు అంతకంటే 21 ఓట్లు ఎక్కువగా దక్కాయి.
Samayam Telugu Sri Lanka New President Ranil Wickremesinghe
శ్రీలంక కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె


కొత్త అధ్యక్షుడి రాకతో శ్రీలంక రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వస్తుందని భావించినా.. తాజా పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించట్లేదు. కొలంబోలో రణిల్ విక్రమసింఘెకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు. అధ్యక్ష కార్యాలయం బయట పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. శ్రీలంకకు గతంలో ఆరు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన రణిల్ విక్రమసింఘెపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది.

రాజపక్స కుటుంబ పాలనతో విసిగిపోయిన లంక వాసులు.. సోదరులిద్దరూ అధ్యక్ష, ప్రధాని పదవులను నుంచి గద్దె దిగే వరకూ తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవి నుంచి దిగిపోయి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రణిల్ విక్రమసింఘె తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

అధ్యక్షుడి ఎన్నికైన తర్వాత రణిల్ విక్రమసింఘె తొలిసారిగా పార్లమెంట్‌లో మాట్లాడారు. దేశం తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోందని.. తమ ముందు పెను సవాళ్లున్నాయని ఆయన అన్నారు. సంక్షోభ నివారణకు అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.