యాప్నగరం

మరో కొత్త కరోనా వైరస్ గుర్తించాం.. దక్షిణాాఫ్రికా ప్రకటనతో ఆందోళన

కరోనా వైరస్ మహమ్మారి మొదలై ఏడాది దాటింది. ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తోన్న వైరస్.. ప్రస్తుతం కొత్త రూపును సంతరించుకుందని దక్షిణాఫ్రికా చేసిన ప్రకటన మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

Samayam Telugu 19 Dec 2020, 2:28 pm
దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా స్ట్రెయిన్‌ (వైరస్)ను గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి జ్వెలీ కిజే శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా వైరస్ రెండో వేవ్‌కి ఈ కొత్త స్ట్రెయిన్ కారణమని తాము నమ్ముతున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం అధ్యయనం నిర్వహిస్తోందని, ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ భౌతికదూరం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జ్వెలీ సూచించారు.
Samayam Telugu కొత్త కరోనా వైరస్
Coronavirus


‘501.V2 అనే కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌ను మేము గుర్తించాం. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా రెండో దశ విజృంభణకు ఈ కొత్తరకం వైరస్ కారణమని దీనికి బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే.. ముందు వైరస్ కంటే ఇది ప్రమాదకరమైనదా? కాదా? దీని బారినపడి కోలుకున్నవారికి మళ్లీ సోకుతుందా? లేదా? అనే ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ కొత్త వైరస్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయని కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ కరీమ్ అన్నారు. ‘ఈ స్ట్రెయిన్‌ను ల్యాబ్‌లో పరిశీలిస్తున్నాం.. కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వ్యక్తుల నుంచి సేకరించిన సీరమ్‌ను దీనిపై ప్రయోగించి, వైరస్ నిర్వీర్యం అవుతుందో? లేదో పరీక్షిస్తాం.. తద్వారా వచ్చే ఫలితాలను బట్టి ఈ కొత్త స్ట్రెయిన్ మునపటి కంటే ప్రమాదకరమైనదా? కాదో అంచనా వేస్తాం’ అని వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి జెల్వీ భరోసా ఇచ్చారు. భౌతిక దూరం నిబంధనలను పాటించడం, మాస్కు ధరించడం వంటి నియమాలను తప్పకుండా పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కొత్త రకం జన్యువును గుర్తించిన దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలతో చర్చించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. అయితే, కరోనా వైరస్ తన రూపం మార్చుకుందనడానికి ఎటువంటి సూచనలు లేవని తెలిపింది.

ఇదిలా ఉండగా.. కొత్త వైరస్ జన్యువును గుర్తించినట్టు బ్రిటన్ ప్రకటించిన కొద్ది రోజులకే దక్షిణాఫ్రికా వెల్లడించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘బ్రిటన్‌లోనూ కొత్త జన్యువును గుర్తించారు ... రెండు జాతుల మధ్య చాలా తక్కువ సారూప్యతలు ఉన్నాయి... ఉత్పరివర్తనలు కూడా ఇదే సంఖ్యలో ఉంటాయి’ అని దక్షిణాఫ్రికా ప్రభుత్వ జినోమిక్స్ కన్సార్టియం సభ్యుడు ప్రొఫెసర్ తులియో డి విలియోరా అన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో 9 లక్షల మంది కరోనా వైరస్ బారినపడగా.. 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.