యాప్నగరం

రెండు నుంచి మూడు వేల మంది సైనికులను చంపాను.. ఎల్టీటీఈ మాజీ నేత ప్రకటన

శ్రీలంకలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం, సైన్యం మధ్య మూడు దశాబ్దాలపాటు తీవ్ర పోరు కొనసాగింది. అయితే, చివరకు భద్రత బలగాలే పైచేయి సాధించి, ఆ సంస్థను నిర్వీర్యం చేశాయి.

Samayam Telugu 23 Jun 2020, 10:15 am
రెండు వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని చంపానంటూ వేర్పాటువాద సంస్థ లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం(ఎల్‌టీటీఈ) మాజీ డిప్యూటీ నేత కరుణ అమ్మన్‌ సంచలన ప్రకటన చేశాడు. ఈ ప్రకటనపై శ్రీలంక పోలీసులు దర్యాప్తునకు ఆదేశించారు. ‘ఎల్‌టీటీఈలో క్రియాశీలకంగా ఉన్నప్పుడు ఎలిఫెంటా పాస్ వద్ద ఓ రాత్రి జరిగిన పోరులో రెండు వేల నుంచి మూడు వేల మంది భద్రతా సిబ్బందిని హతమార్చాను. కిలినోచిలో చాలా మంది చంపాను.. ఈ సంఖ్య శ్రీలంక ప్రభుత్వం ప్రకటిస్తున్న కరోనా మరణాలు కంటే చాలా ఎక్కువ’ అని అమ్మన్‌ గతవారం ఓ ఎన్నికల ర్యాలీలో ప్రకటించినట్టు శ్రీలంక పోలీసులు పేర్కొన్నారు.
Samayam Telugu ఎల్టీటీఈ నేత ప్రకటన
LTTE Leader Karun Amman


దేశ చట్టాలను ధిక్కరించేలా చేసిన ఇలాంటి వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోమని, చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని శ్రీలంక రక్షణ మంత్రి రువాన్‌ విజయవర్ధనె ఉద్ఘాటించారు. అమ్మన్ ప్రకటన కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైందంటూ కరాథివు స్థానిక ప్రభుత్వ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఎల్టీటీఈలో కరుణ అమ్మన్ కీలకంగా వ్యవహరించారు. అయితే, 2004లో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించారు.

అమ్మన్ తన అనుచరులతో కలిసి ఎల్టీటీఈ వీడిన తర్వాత ఆ సంస్థ పూర్తిగా బలహీనమయ్యింది. దీంతో 2009లో భద్రతా దళాలు ఆ సంస్థను తుదముట్టించాయి. అఖిల ఇళాంకి ద్రవిడ మహా సభ పార్టీ తరఫున 2010 ఎన్నికల్లో గెలిచి, మహేంద్ రాజపక్సే క్యాబినెట్‌లో డిప్యూటీ మంత్రిగా చేరారు.

కాగా.. శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్సే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆరు నెలల ముందే మార్చి 2న పార్లమెంట్‌ను రద్దుచేయడంతో ఏప్రిల్ 25న ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ వెల్లడించింది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి శ్రీలంకలో మొదలుకావడంతో జూన్ 20 వరకు రెండు నెలల పాటు ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పటికీ వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టకపోవడంతో ఎన్నికలను ఆగస్టు 5కు వాయిదావేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.