యాప్నగరం

Himalayan Viagra: మూలికల కోసం వెళ్లి హిమపాతంలో ఆరుగురు గల్లంతు.. ముగ్గురు మృతి

Himalayan Viagra హిమాలయాల్లో గొంగళి పురుగులను ‘యర్సగుంబు’ అని అంటారు. టిబెట్ భాషలో ‘చలికాలం పురుగు’ లేదా ‘వేసవి గడ్డి’ అని అర్థం. ఇవి కేవలం హిమాలయాల్లో మాత్రమే లభ్యమవుతాయి. అందుకే వీటిని ‘హిమాలయన్ వయాగ్రా’ అని పిలుస్తారు. సముద్రమట్టానికి సుమారు 3 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తులో జీవించే కీడా జాడీ అనే గొంగళి పురుగులు నేలపై పాకే సమయంలో ఫంగస్‌కు గురవ్వుతాయి. భూమిలోకి కూరుకుపోయి చనిపోతాయి

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 4 May 2023, 9:30 am

ప్రధానాంశాలు:

  • హిమాలయ పర్వతాల్లో అరుదైన మూలికలు
  • యర్షగుంబా కోసం వెళ్లిన 12 మంది నేపాలీలు
  • మంగళవారం భారీ మంచు తుఫాను
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nepal Avalanche
హిమాలయాల్లో (Himalayan Mountains) అరుదైన మూలికల అన్వేషణ కోసం వెళ్లి ఆరుగురు అదృశ్యమైన ఘటన నేపాల్‌లో చోటుచేసుకుంది. హిమాలయన్‌ వయాగ్రా (Himalayan Viagra)గా పిలిచే అత్యంత విలువైన మూలిక యర్షగుంబా (Yarsagumba)ను తీసుకొచ్చేందుకు వెళ్లిన బృందం హిమపాతంలో చిక్కుకున్నారు. వారిలో ఆరుగురి ఆచూకీ గల్లంతుకాగా... ఇప్పటి వరకూ మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. నేపాల్‌ ధార్‌చులా జిల్లాలోని కొండల్లో మంగళవారం భారీ హిమపాతం సంభవించింది. అదే సమయంలో యర్షగుంబా మూలిక అన్వేషణలో భాగంగా అక్కడ టెంట్లు వేసుకున్న 12 మంది ఆ మంచు తుఫానులో గల్లంతయ్యారు.
తక్షణమే స్పందించిన స్థానికులు భద్రతా దళాలకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. వారిలో కొందర్ని ప్రాణాలతో రక్షించగా.. మరో నలుగురు పురుషులు, ఇద్దరు స్త్రీల ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ నేపథ్యంలో అదనంగా మరో 25 మంది భద్రతా సిబ్బందిని అక్కడకు పంపారు. ఈ క్రమంలో గల్లంతైన ఆరుగురులో ముగ్గురు చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఇద్దరు మహిళలు సహా మూడు మృతదేహాలను గుర్తించారు. కనిపించకుండా పోయిన ప్రదేశానికి కిలోమీటరున్నర దూరంలో మృతదేహాలను గుర్తించామని స్థానిక డీఎస్పీ ఈశ్వరిదత్తా భట్ తెలిపారు. మృతదేహాలను గుర్తించిన ప్రదేశానికి స్థానికులు, నేపాల్ పోలీసులు, తమ బృందాలు చేరుకున్నాయని వీరిని గుర్తించాల్సి ఉందని చెప్పారు.

మరో ఘటనలో యర్షగుంబా తీసుకొచ్చేందుకు వెళ్లిన మరో మహిళ కూడా హిమపాతంలో మునిగిపోయిందని బజ్‌హింగ్‌ జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఆమె కోసం ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టామని అన్నారు. యర్షగుంబా (Yarsagumba) అనేది హిమాలయాల్లో లభించే అత్యంత అరుదైన మూలిక. పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్‌ (Cordyceps)ను హిమాలయన్‌ గోల్డ్‌ లేదా గొంగళి పురుగు ఫంగస్‌ (Caterpillar Fungus)గా పిలుస్తారు.

హిమాలయ ప్రాంతంలో అత్యంత అరుదుగా లభించే ఈ ఫంగస్‌లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఈ మూలికల్లో ఉంటుందని నమ్ముతారు. అందుకే దీనికి ‘హిమాలయన్‌ వయాగ్రా (Himalayan Viagra)’ అనే పేరుంది. నేపాల్‌ మార్కెట్లోనే దీని ధర గ్రాముకు రూ.50వేలకు పైగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి భారీ డిమాండ్ ఉంది. ఈ మూలిక కోసం చైనా సైనికులు భారత భూ భాగంలోకి పదేపదే చొరబాట్లకు పాల్పడుతుంటారనే వార్తలు కూడా గతంలో వచ్చాయి.


Read More Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.