యాప్నగరం

IAF: ఆకాశంలో అద్భుతం.. భారత యుద్ధ విమానాలకు యూఏఈ అరుదైన సాయం!

IAF | భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ యుద్ధ విమానాలను యూఏఈ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం గాల్లోనే ఇంధనాన్ని నింపింది. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది. భారత్, యూఏఈ మధ్య ఉన్న బలమైన సంబంధాలకు ఈ ఘటన అద్దం పట్టింది. భారత యుద్ధ విమానాలు టాక్టికల్ లీడర్‌షిప్ ప్రోగ్రాంలో పాల్గొనడం కోసం ఈజిప్ట్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో రఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుతున్న సమయంలోనూ యూఏఈ వాటికి గాల్లోనే ఇంధనాన్ని నింపింది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 24 Jun 2022, 6:57 pm

ప్రధానాంశాలు:

  • ఐఏఎఫ్ యుద్ద విమానాలకు గాల్లోనే ఇంధనాన్ని నింపిన యూఏఈ ఎయిర్‌క్రాఫ్ట్
  • యూఏఈని ప్రశంసించిన భారత వాయుసేన
  • భారత యుద్ధ విమానాలు ఈజిప్టు వెళ్తుండగా ఘటన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu UAE Aircraft In-Flight Refueling to IAF Fighter Jets
UAE Aircraft In-Flight Refueling to IAF Fighter Jets
IAF | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలకు యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ఎయిర్‌ఫోర్స్‌ విమానం గాల్లోనే ఇంధనాన్ని నింపింది. భారత వాయుసేన (Indian Air Force)కు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు టాక్టికల్ లీడర్‌షిప్ ప్రోగ్రాంలో పాల్గొనడం కోసం ఈజిప్ట్ బయల్దేరి వెళ్లాయి. ఈ క్రమంలో ఆరు గంటలపాటు అవి నిరంతరాయంగా ప్రయాణించాయి. అవి యూఏఈ మీదుగా ప్రయాణిస్తుండగా.. ఆ దేశ వాయుసేనకు చెందిన ఎంఆర్‌టీటీ ఎయిర్‌క్రాఫ్ట్ గాల్లోనే ఇంధనాన్ని నింపింది. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది. యూఏఈ ఎయిర్‌ఫోర్స్ సహకారాన్ని ప్రశంసించింది. వ్యూహాత్మక నాయకత్వ కార్యక్రమం కింద భారత్, ఈజిప్ట్ దేశాలకు చెందిన ఎయిర్‌ఫోర్స్ విమానాలు సంయుక్త విన్యాసాలు చేపట్టనున్నాయి.
భారత్ రఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి బయల్దేరి ఎక్కడా ఆగకుండా భారత్‌ చేరుకున్నాయి. ఈ క్రమంలో యూఏఈ విమానాలే రఫెల్ జెట్లకు గాల్లో ఇంధనాన్ని నింపాయి. ఇరు దేశాల వైమానిక దళాల మధ్య ఉన్న బలమైన సంబంధాలకు ఇది నిదర్శనం అని అప్పట్లో ఫ్రాన్స్‌లోని భారత ఎంబసీ ప్రశంసించింది.
ఇలా చేయడం వల్ల ఇంధనం ఆదా..
గాల్లోనే మరో విమానం సాయంతో విమానాల్లో ఇంధనాన్ని నింపడాన్ని ఏరియల్ రీఫ్యుయెలింగ్ లేదా ఇన్‌ఫ్లయిట్ రీఫ్యూయెలింగ్ లేదా ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయెలింగ్ (Air To Air Refueling) అని పిలుస్తారు. సాధారణంగా భారీ ఆయుధాలతో గాల్లోకి ఎగిరే యుద్ధ విమానాలు తక్కువ ఇంధనంతో గాల్లోకి ఎగురుతాయి. తర్వాత గాల్లోనే ఇంధనాన్ని నింపుతారు. దీని వల్ల ఇంధన వాడకం తగ్గుతుంది. దూర ప్రయాణం చేసే విమానాల్లో ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయెలింగ్ వల్ల 35-40 శాతం ఇంధనం ఆదా అవుతుంది. 1920ల నుంచే ఈ విధానం వాడుకలో ఉంది.

యూఏఈతో బలమైన సంబంధాలు..
భారత్, యూఏఈ మధ్య ఉన్న బలమైన సంబంధాలకు ఈ ఘటన అద్దం పడుతోంది. గత పదేళ్లలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య, రక్షణ సంబంధాలు బలోపేతం అయ్యాయి. I2U2 పేరిట భారత్, ఇజ్రాయెల్, యూఏఈతో అమెరికా ఇటీవలే ఓ గ్రూపును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో భారీగా పెట్టుబడులకు యూఏఈ ఇప్పటికే ఆసక్తి కనబర్చింది. ఆ దేశంలో పెద్ద ఎత్తున భారతీయులు పని చేస్తున్నారు.

త్వరలోనే యూఏఈ వెళ్లనున్న ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 28న యూఏఈ వెళ్లనున్నారు. జర్మనీలో జీ-7 సదస్సులో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి ప్రధాని మోదీ యూఏఈ బయల్దేరి వెళ్తారు. దివంగత యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ఆయన నివాళులు అర్పిస్తారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.