యాప్నగరం

మరో టీకాకు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం.. ట్రంప్ ఫుల్ ఖుషీ

కరోనా వైరస్ మహమ్మారితో సతమతమవుతున్న అమెరికా ప్రజలకు మరో ఊరట కలిగించే నిర్ణయం ఎఫ్‌డీఏ తీసుకుంది. ఇప్పటికే ఫైజర్ టీకాకు ఆమోదం తెలపగా.. తాజాగా, మోడెర్నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Samayam Telugu 19 Dec 2020, 7:03 am
కరోనా వైరస్‌కు అత్యవసర వినియోగం కింద ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాను ఇప్పటికే ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలపడంతో అమెరికా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా, మరో వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. అమెరికా ఫార్మ దిగ్గజం ‘మోడెర్నా’అభివృద్ధి చేసిన కోవిడ్-19 టీకా అత్యవసర వినియోగానికి శుక్రవారం ఆమోదముద్ర వేసింది. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు అత్యవసరంగా మోడెర్నా టీకాను వినియోగించవచ్చని ఎఫ్‌డీఏ నిపుణుల కమిటీ గురువారం సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీఏ సానుకూల నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu మోడెర్నా టీకాా
Moderna Vaccine


‘ఎంఆర్‌ఎన్‌ఏ-1273’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ టీకాను విస్తృతంగా పంపిణీ చేయడానికి మోడెర్నా ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఎఫ్‌డీఏకు చెందిన వ్యాక్సిన్లు, జీవ ఉత్పత్తుల సలహా సంఘం సభ్యులంతా ఈ టీకాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి తుది అనుమతులు లభించాయి. ఎఫ్‌డీఏ అనుమతించడంతో టీకాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక, ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపిన వెంటనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్పందిస్తూ... మోడెర్నా‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీకాకు ఆమోదం లభించిందని, ఇక ఉన్నఫళంగా పంపిణీకి ఏర్పాట్లు చేయాల్సి ఉందని ఆయన ట్వీట్‌ చేశారు.

‘ప్రస్తుతం రెండు వ్యాక్సిన్‌ల లభ్యతతో కోవిడ్ -19 నివారణకు మరో ముందడుగు పడింది.. ప్రపంచ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ఎఫ్‌డీఏ మరో కీలకమైన చర్య తీసుకుంది’ అని ఎఫ్‌డీఏ చీఫ్ స్టీఫెన్ హాన్ వ్యాఖ్యానించారు. కాగా, తాము తయారుచేసిన టీకా సురక్షితమని, 94.1% సమర్థంగా పనిచేస్తున్నట్టు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడయినట్టు మోడెర్నా వెల్లడించింది. ఈ టీకా వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని పేర్కొంది. ఫైజర్‌ టీకాను మైనస్‌ 70-90 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద భద్రత పరచాల్సి ఉండగా... మోడెర్నా టీకాను మాత్రం సాధారణ ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేయవచ్చు. దీని వల్ల మారుమూల ప్రాంతాలకు సైతం టీకాను ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయవచ్చు. వృథాను కూడా అరికట్టవచ్చు.

అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 3.17 లక్షల మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గతవారం రోజుల నుంచి రోజుకు సగటున 3వేల మంది బలవుతున్నారు. అలాగే పాజిటివ్‌ కేసులు లక్షల్లోనే నమోదవుతున్నాయి. దీంతో వీలైనంత త్వరగా సాధారణ ప్రజలకు టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.