యాప్నగరం

పాక్‌ను ఉగ్రదేశంగా ప్రకటించే దిశగా అమెరికా అడుగులు

పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించే దిశగా అమెరికా వేగంగా అడుగులేస్తోంది.

TNN 19 Sep 2017, 5:39 pm
పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడానికి అమెరికా సిద్ధపడుతోంది. నాటోయేతర మిత్రదేశ హోదాను ఉపసంహరించుకొని, పాక్‌ను ఉగ్రదేశంగా ప్రకటిస్తే.. ఆ దేశానికి ఆయుధాల అమ్మకాలు తగ్గిపోతాయి. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు తదితర సంస్థల నుంచి తీసుకునే రుణాలపైనా తీవ్ర ప్రభావం ఉంటుంది. పాకిస్థాన్ చైనాతో అంటకాగడం కూడా అమెరికాకు ఆగ్రహం కలిగిస్తోంది. పాకిస్థాన్ చెప్పేదొకటి.. చేస్తున్నది మరొకటని అమెరికా బలంగా నమ్ముతోంది.
Samayam Telugu us moves closer to designating pakistan a terrorist state
పాక్‌ను ఉగ్రదేశంగా ప్రకటించే దిశగా అమెరికా అడుగులు


ఇటీవలే దక్షిణాసియా - అప్ఘాన్ నూతన పాలసీని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని విమర్శించారు. నాటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోన్నందున పాక్‌కు ఆర్థిక సాయం నిలిపేయాలని అమెరికా భావిస్తోంది. నాటోయేతర దేశాల్లో అమెరికాకు అతిపెద్ద మిత్రదేశంగా పాక్ కొనసాగుతోంది. ఇప్పుడు ఆ హోదాను వెనక్కి తీసుకుంటామని అగ్రరాజ్యం పాక్‌ను హెచ్చరించింది. అమెరికా వైఖరితో కంగుతిన్న పాక్.. ఆ దేశంతో కఠిన దౌత్య విధానాన్ని అవలంభిస్తామని హెచ్చరించింది. అప్పటికీ యూఎస్ తమ మాట వినకపోతే.. అప్ఘాన్‌లోని నాటో దళాలకు తమ గడ్డ మీద నుంచి ఏ రకంగానూ సాయం అందించబోమని ప్రకటించింది.

అమెరికా ఆర్థిక సాయం నిలిపేస్తే పాక్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. 1971లో పాకిస్థాన్ నుంచి స్వాతంత్యం ప్రకటించుకున్న బంగ్లాదేశ్ వద్ద ఆ దేశం కంటే ఎక్కువ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఎగుమతులు, ఆర్థికంగా వ్యవహారాల్లోనూ పాక్ కంటే బంగ్లా మెరుగ్గా ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలు పాక్‌కు మింగుడు పడటం లేదు. అమెరికా ఆర్థిక సాయం నిలిపేస్తే తీవ్ర ప్రభావం ఉంటుందని భయపడుతోన్న పాక్.. తమకు చైనా సాయం చేస్తుందని భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.