యాప్నగరం

భారత్‌తో చర్చల కోసం అమెరికాను బతిమాలుతున్న పాక్!

సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బ రుచి చూసిన పాక్.. ఎక్కడ యుద్ధం వస్తుందేమోనని భయపడుతోంది. భారత్‌ను చర్చలకు ఒప్పించాలని కోరుతూ అమెరికాను వేడుకుంటోంది.

TNN 20 Oct 2016, 3:34 pm
అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్థాన్‌ను ఒంటరి చేయాలని చూస్తున్న భారత్ ప్రయత్నాలు ఆ దేశాన్ని కలవరపెడుతున్నాయి. యూరీ ఘటన నేపథ్యంలో పాక్ పట్ల భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉందనే సంగతి తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో భారత సైన్యం పీవోకేలో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకోవడంతో పాక్‌కు దడ పుట్టుకుంది. మేం యుద్ధం కోరుకోవడం లేదని, చర్చలకు సిద్ధమని పదే పదే చెబుతోంది. అయినప్పటికీ ఉగ్రవాదంతో రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించిన భారత ప్రభుత్వం పాక్ ప్రతిపాదనలకు ససేమిరా అంటోంది. దీంతో తమతో చర్చలకు జరిపేందుకు భారత్‌ను ఒప్పించాలని కోరుతూ పాక్ అమెరికాను వేడుకుంటోంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికారి ఒకరు ఆ దేశ మీడియాకు తెలిపారు.
Samayam Telugu worried pakistan asks us to help bring india to talks the nation newspaper says
భారత్‌తో చర్చల కోసం అమెరికాను బతిమాలుతున్న పాక్!


పాకిస్థాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఏ మాత్రం పోరాడుతుందనే విషయమై అమెరికాకు కూడా అనుమానాలున్నాయని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాక్ యుద్ధం కోరుకోవడం లేదని పాక్ విదేశాంగ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ‘భారత్‌ మాత్రమే కాకుండా పశ్చిమ దేశాలన్నీ ఉగ్రవాదంపై తాము చేస్తున్న పోరాటం పట్ల అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నాయనే విషయాన్ని అమెరికా వెల్లడించింది. భారత్‌తో చర్చల కోసం పాక్ చేస్తున్న ప్రయత్నాల పట్ల అమెరికా కాస్త సానుకూలంగానే ఉన్నప్పటికీ, పాక్ పట్ల భారత్ అనుమానాలు నిజమేనని భావిస్తోంది. తాము చర్చలకు సిద్ధమని ​ పదే పదే ప్రకటించినప్పటికీ.. భారత్ వైపు నుంచి స్పందన కొరవడింది’ అని పాక్ అధికారులు తెలిపారు. తీవ్రవాదంపై పోరాటంలో మరింత మెరుగ్గా కృషి చేయాలని అమెరికా పాక్‌కు సూచించింది, తద్వారా భారత్‌తో చర్చలకు ప్రయత్నించవచ్చని కూడా సలహా ఇచ్చింది.

చర్చల కోసం పాకిస్థాన్ తెచ్చిన ఒత్తిడి వల్లే.. అమెరికా చర్చల విషయాన్ని ప్రస్తావించిందని కూడా పాక్ విదేశాంగ వర్గాలు మీడియాకు తెలిపాయి. చర్చలతోనే ఫలితం ఉంటుందని విశ్వసిస్తున్న పాక్ తరహాలోనే అమెరికా కూడా ఆలోచిస్తోందని, అయితే ఇందుకోసం ఉగ్రవాదంపై మరింత పోరాటం చేయాలని పదే పదే తమకు చెబుతున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్‌కు కొద్ది రోజుల క్రితమే అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాద సంస్థలపై పాక్ చర్యలు తీసుకునేలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. సమస్యల పరిష్కారానికి భారత్, పాక్‌లు శాంతిపూర్వకంగా ప్రయత్నాలు చేయాలని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.