యాప్నగరం

మోదీ తీరుతో జిన్‌పింగ్‌లో కలవరం!

చైనాను భారత్ ఎందుకు కలవరానికి గురి చేస్తోంది. తన ఆర్థిక ప్రాబల్యంతో పొరుగు దేశాలను గుప్పిట్లో పెట్టుకుంటున్న చైనా.. భారత్‌కు భయపడుతోందా?

TNN 8 Aug 2017, 9:29 am
నరేంద్ర మోదీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విదేశాంగ విధానంపై తనదైన ముద్ర వేశారు. ప్రపంచమంతా చుట్టి వచ్చి.. ఇతర దేశాల్లో భారత్ పట్ల సానుకుల దృక్పథం ఏర్పడేలా చేశారు. ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న చైనాతోనూ ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వాణిజ్యానికి ఓకే అంటూనే.. దేశ రక్షణకు పెద్ద పీట వేస్తున్నారు. ఇటీవల డోక్లాం వివాదం ముదరడంతో.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో సభ్యత్వానికి మోకాలడ్డటం, ఐరాసలో మసూద్ అజహర్‌ను వెనుకేసుకొస్తుండటం తదితర కారణాలతో మోదీ సర్కారు చైనా పట్ల ఆగ్రహంగా ఉంది. డోక్లాంలో రోడ్డు మార్గం రూపంలో మోదీకి చైనాను నిలువరించే అవకాశం లభించింది. దీంతో డ్రాగన్‌కు చెక్ పెట్టడం కోసం గతంలో ఏ భారత ప్రధాని కూడా వ్యవహరించనంత దూకుడుగా మోదీ చైనా పట్ల వ్యహరిస్తున్నారు. అలాంటి మోదీ గురించి చైనా అధ్యక్షుడు ఏమని భావిస్తున్నాడో తెలుసా?
Samayam Telugu xi jinping sees pm modi as a leader who is willing to stand up for indian interests us expert
మోదీ తీరుతో జిన్‌పింగ్‌లో కలవరం!


‘ఓ నాయకుడిగా మోదీకి భారత ప్రయోజనాలే ముఖ్యం. చైనాకు అవరోధాలు కల్పించడం కోసం ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో కలిసి పని చేసేందుకు ఆయన సుముఖంగా ఉన్నారు’ అని జిన్‌పింగ్ భావిస్తున్నారట. ఈ విషయాన్ని అమెరికా నిపుణురాలు వెల్లడించారు. ముఖ్యంగా జపాన్, అమెరికాలతో కలిసి పని చేయాలని మోదీ భావిస్తుండటం డ్రాగన్‌కు మింగుడు పడటం లేదని బొన్నీ ఎస్ గ్లాసెర్ అనే అమెరికన్ ఎక్స్‌పర్ట్ తెలిపారు. ఆమెకు చైనా వ్యవహారాల పట్ల మంచి పట్టుంది.

‘భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకోవాలని చైనా భావించడం లేదు. అందుకే మోదీ పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే జిన్‌పింగ్ ఢిల్లీ వెళ్లి ఆయన్ను కలిశారు. చైనా ప్రయోజనాలకు వ్యతిరేకంగా భారత్ నడుచుకోదని ఆయన ఆశించారు. కానీ అది సాధ్యం కాలేదు. దీర్ఘకాలంలో భారత్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని చైనా బలంగా నమ్ముతోంది. అది తమకు ఇబ్బందులు కలిగిస్తోందేమో అనేది చైనా ఆందోళన. డ్రాగన్ ఆధిపత్యానికి గండి కొట్టడం కోసం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో భారత్ చెట్టాపట్టాలేసుకొని తిరుతుగుండటమే ఇప్పుడు చైనాకు మింగుడు పడటం లేదు.’ అని గ్లాసెర్ తెలిపారు.

సైనిక పరంగా కంటే.. రాజకీయంగానే భారత్‌తో ఎక్కువగా ఇబ్బంది ఉందని చైనా భావిస్తోంది. పెరుగుతున్న ప్రాబ్యలంతో భారత్ డోక్లాం లాంటి వివాదాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలని అనుకుంటుందేమో అనే సందేహం చైనాను వెంటాడుతోంది. చలికాలం వస్తేనే డోక్లాం వివాదానికి ముగింపు లభిస్తుంది. లేదంటే భూటాన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గ్లాసెర్ భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.