యాప్నగరం

ఇంగ్లండ్‌లో ఖమ్మం వాసి మృతి

ఇంగ్లండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం వాసి మృతి చెందారు.

TNN 4 Oct 2017, 12:43 pm
ఇంగ్లండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం వాసి మృతి చెందారు. ఖమ్మంలోని బుర్హాన్‌పురానికి చెందిన శ్రీధర్ మున్నలూరి శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మరణించినట్లు స్విండన్ హిందూ ఆలయ చైర్మన్ ప్రదీప్ భరద్వాజ్ వెల్లడించారు. ఓ టాక్సీ ఢీకొనడంతో శ్రీధర్‌కి తీవ్రగాయాలయ్యాయని, వెంటనే ఆయన్ని స్థానిక ఆసుపత్రి తరలించినా ప్రాణాలు కాపాడుకోలేకపోయామని భరద్వాజ్ మంగళవారం తెలిపారు. స్థానిక వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ గుర్తుతెలియని ట్యాక్సీ శ్రీధర్‌ను ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన శ్రీధర్‌ను వెంటనే బ్రిస్టల్‌లోని సౌత్‌మెడ్ ట్రౌమా సెంటర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu khammam man dies in uk road accident
ఇంగ్లండ్‌లో ఖమ్మం వాసి మృతి


కర్ణాటకలోని రాయచూర్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన శ్రీధర్.. ఆ తరవాత ఇంగ్లండ్‌లో స్థిరపడ్డారు. నైరుతి ఇంగ్లండ్‌లోని పెద్ద పట్టణమైన స్విండన్‌లోని బ్రూనెల్ క్రెసెంట్‌లో భార్య, ఎనిమిదేళ్లు, ఐదు నెలల వయసున్న ఇద్దరు కుమార్తెలతో నివాసముంటున్నారు. కాగా, శ్రీధర్ కుటుంబానికి తమ కమ్యూనిటీ అండగా ఉంటుందని స్విండన్ హిందూ ఆలయ చైర్మన్ ప్రదీప్ భరద్వాజ్ చెప్పారు. శ్రీధర్ మరణం తమ కమ్యూనిటీకి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. యాక్సిడెంట్ కేసును విచారిస్తున్న పోలీసులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. స్విండన్ హిందూ టెంపుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విరాళాలు సేకరిస్తున్నామని, ఇప్పటికి 34,157 యూరోలు (సుమారు రూ.29.5 లక్షలు) సేకరించినట్లు ఆయన వివరించారు. ఇంకా విరాళాలు వస్తున్నాయని, ఈ మొత్తాన్ని శ్రీధర్ కుటుంబానికి అందజేస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.