యాప్నగరం

పదేపదే.. అదే ప్రదేశంలో ప్రమాదాలు!

సాధారణంగా కొన్ని రహదారులపై ప్రమాదాలు తరచుగా ఒకే స్పాట్‌లో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రదేశాలపై ఆసక్తికర కథనాలు కూడా..

TNN 15 Apr 2017, 2:24 pm
సాధారణంగా కొన్ని రహదారులపై ప్రమాదాలు తరచుగా ఒకే స్పాట్‌లో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రదేశాలపై ఆసక్తికర కథనాలు కూడా ప్రచారంలో ఉంటాయి. నిజానికి ఈ విషయంలో రోడ్డుకు సంభంధించిన లోపాలున్నా.. అక్కడ ఏదో ఉండటం వల్లే ఇలా జరుగుతుందంటూ రకరకాల పుకార్లు షికారు చేస్తుంటాయి. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదం మరోసారి ఇలాంటి వార్తలకు ఊతమిస్తోంది. తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Samayam Telugu 100 accidents every year at a tragedy spot in hyderabad
పదేపదే.. అదే ప్రదేశంలో ప్రమాదాలు!


హస్మత్‌పేటకు చెందిన అజహర్ గురువారం రాత్రి తిరుమలగిరిలో బంధువుల వివాహం ఉండటంతో భార్య, పిల్లలతో కలిసి వెళ్లాడు. తిరిగి వస్తుండగా ఆర్టీఏ కార్యాలయం వద్దకు రాగానే కుమార్తె ఐస్‌క్రీం కావాలని కోరింది. వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి ఐస్‌క్రీం తింటుండగా.. జీహెచ్‌ఎంసీకి చెందిన చెత్త టిప్పర్‌ వారిని ఢీకొట్టి 15 అడుగుల మేర ఈడ్చుకెళ్లింది. దీంతో అతడి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన అజహర్‌ ఆసుపత్రిలో మరణించాడు. తల్లీ, మరో కుమార్తె చికిత్స పొందుతున్నారు. కాలుకు మొల గుచ్చుకున్న బాధతో ఉన్న అజహర్ మొదట.. పంక్షన్‌కు వెళ్లడానికి ఆసక్తి కనబరచలేదు. కానీ, అతడి చిన్న కుమార్తె వెళ్దామని కోరడంతో.. బయలుదేరి అనూహ్యంగా మృత్యువు బారినపడ్డారు.

సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ కూడలి నుంచి శామీర్‌పేట వరకు ఉన్న 20 కిలోమీటర్ల పరిధిలో ఏటా 100 వరకూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో 15 నుంచి 25 వరకు యాక్సిడెంట్లలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్యాట్నీ - శామీర్‌పేట రోడ్డులో తరచుగా ప్రమాదాలు జరిగే ట్రాజెడీ యాక్సిడెంట్ స్పాట్లు ప్రధానంగా 5 ఉన్నాయి.. అవి: 1) తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీస్ 2) హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ 3) నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ 4) తూముకుంట కూడలి 5) బిట్స్-హైదరాబాద్ జంక్షన్.

ఈ ప్రాంతాల్లో.. రహదారి సన్నగా ఉండటమే కాకుండా, అనేక చోట్ల వంపులు తిరిగి ఉంది. చాలా ప్రదేశాల్లో వీధి లైట్లు కూడా పనిచేయడం లేదు. అందువల్ల ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇటీవల రద్దీ బాగా పెరిగిన ఈ రహదారి వెంట.. రాష్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని రోడ్డు భద్రతా ప్రమాణాల గురించి పోరాడుతున్న పలువురు పదే పదే విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.
ప్యాట్నీ నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ వే నిర్మించాలనే ప్రతిపాదన ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉంది. ఈ రోడ్డు చాలా వరకూ ఆర్మీ పరిధిలో ఉండటంతో.. విస్తరణ చేయడానికి అనుమతుల విషయంలోనూ పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.