యాప్నగరం

కంటతడి పెట్టిస్తున్న ఆవుల ఆకలి చావులు..

గోమాతగా పూజించే ఆవులు ఇలా అత్యంత విషాధకర రీతిలో మరణించడం పట్ల పలువురు జంతు ప్రేమికులు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాలను కన్నబిడ్డల్లా చూసుకునే రైతులు..

TNN 20 Jul 2017, 8:35 pm
మూగ జీవాలకు పెద్ద ముప్పొచ్చింది. గత కొన్ని నెలలుగా సరైన ఆహారం లేక ఆకలితో అలమటించి చిక్కి శల్యమైన ఆవులు ఒక్కోటిగా మరణిస్తున్నాయి. కాకినాడలో ఓ జంతు హింస నివారణ సంఘంలో కొనసాగుతున్న ఈ గోవుల మృత్యువాత ఆంధ్రప్రదేశ్‌ వాసులందర్నీ తీవ్రంగా కలిచి వేస్తోంది. 3 రోజుల వ్యవధిలో 32 గోవులు మరణించడం అత్యంత విషాదకరం. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం ఆ యానిమల్ షెల్టర్‌ను బుధవారం (జులై 19) తమ అధీనంలోకి తీసుకుంది. ఆ మూగజీవాల ప్రాణాలను నిలబెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Samayam Telugu 32 cattle die of starvation at animal shelter in kakinada of andhra pradesh
కంటతడి పెట్టిస్తున్న ఆవుల ఆకలి చావులు..


ఇటీవల కురిసిన వర్షాలతో మోకాలు లోతు బురదలో కూరుకుపోయిన ఆ గోవుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. బురదలో కొట్టుమిట్టాడుతూ ఎటూ కదల్లేని స్థితిలో ఉన్న ఆవులు, గేదెలను ప్రొక్లెయినర్లు, ట్రాక్టర్ల సాయంతో చికిత్స కోసం తరలించారు. వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో వాటికి సెలైన్లు, ఇంజెక్షన్లు ఇస్తున్నారు.

మరోవైపు ఆకలితో నకనకలాడుతున్న ఆ ఆవులు, గేదెలకు.. దాతలు, ప్రభుత్వ యంత్రాంగం అందిస్తున్న ఆహారం ఏమాత్రం సరిపోవడం లేదు. బుధవారం రెండు లారీల ఎండుగడ్డి, కాయగూరలు అందించినా.. ఆ మూగ ప్రాణులకు ఎటూ సరిపోలేదు. దీంతో ఒక్కరోజే 11 ఆవులు, గేదెలు మృత్యువాత పడ్డాయి.

మానవుడు తన స్వార్థం కోసం చేస్తున్న పనుల కారణంగా కరవు తాండవిస్తుండటంతో గోమాతగా పూజించే ఆవులు ఇలా అత్యంత విషాధకర రీతిలో మరణించడం పట్ల పలువురు జంతు ప్రేమికులు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాలను కన్నబిడ్డల్లా చూసుకునే రైతులు ఈ విషయం తెలిసి కన్నీటి పర్యంతమవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.