యాప్నగరం

నెలరోజులుగా ఫ్లాట్లోనే శవం.. ఇదీ అపార్ట్‌మెంట్ కల్చర్!

నగరాలు, పట్టణాల్లో అపార్ట్‌మెంట్ల సంస్కృతి ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. తమ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో సాటి మనిషి చనిపోయినా ఎవరికీ తెలియలేదు.

TNN 6 Oct 2017, 2:58 pm
నగరాలు, పట్టణాల్లో అపార్ట్‌మెంట్ల సంస్కృతి ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. తమ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో సాటి మనిషి చనిపోయినా ఎవరికీ తెలియలేదు. ఆ శవం 40 రోజులుగా ఆ ఇంట్లోనే పడిఉన్నా ఎవరూ గుర్తించలేదు. కన్న కూతుళ్లు, కట్టుకున్న భార్య వచ్చి తలుపులు తెరిస్తే గానీ అందులో ఓ వ్యక్తి చనిపోయి పడిఉన్నారని తెలియలేదు. నిర్జీవంగా పడి ఉన్న ఆయన్ని చూసిన తల్లీకూతుళ్లు బోరున విలపించారు. ఈ సంఘటనను చూస్తుంటే అపార్ట్‌మెంట్ కల్చర్ ఎలా ఉందో అర్థమైపోతుంది.
Samayam Telugu 75 year old man lies dead in flat for 40 days while wife daughters are away in us
నెలరోజులుగా ఫ్లాట్లోనే శవం.. ఇదీ అపార్ట్‌మెంట్ కల్చర్!


రాజమండ్రికి చెందిన లక్ష్మీనారాయణ మూర్తి(75) ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైరయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు అమెరికాలో స్థిరపడ్డారు. తల్లిదండ్రుల కోసం నెలనెలా డబ్బు పంపేవారు. కుమార్తెల దగ్గర కొంతకాలం గడిపి రమ్మని ఇటీవలే భార్యను మూర్తి అమెరికాకు పంపారు. ఆయన మాత్రం ఇక్కడే ఉండిపోయారు. అయితే ఒక కుమార్తెకు ఎల్బీనగర్‌ వద్ద రాక్‌టౌన్‌లోని సాయిమారుతీ రెసిడెన్సీలో ఓ ఖాళీ ఫ్లాట్‌ ఉంది. మూర్తి ఎప్పుడైనా నగరానికి వచ్చినప్పుడు అందులో ఉండేవారు. ఆగస్టు 18న బంధువుల ఇంట్లో శుభకార్యానికని హైదరాబాద్‌ వచ్చారు. ఆ తర్వాతి నుంచి ఆయన ఆచూకీ లభించలేదు.

తలుపులు పగలగొట్టి..
ఫోన్ చేసినా తీయకపోవడం, ఎక్కడున్నారో తెలియకపోవడంతో కంగారుపడిన మూర్తి భార్య, కుమార్తెలు మంగళవారం ఉదయం అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఎల్బీనగర్‌లోని ఫ్లాట్‌కు చేరుకుని తెరిచేందుకు ప్రయత్నించారు. ఎంతకీ తెరుచుకోకపోవడంతో పగలగొట్టించారు. తలుపులు తెరుచుకున్న వెంటనే ఒక్కసారిగా గది నుంచి దుర్వాసన రావడంతో షాక్‌కు గురయ్యారు. హాల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మూర్తి మృతదేహాన్ని చూసి నివ్వెరపోయి బోరుమని విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మూర్తి మృతికి కారణాలను అన్వేషించారు.

కాలుజారి పడిపోవడం వల్లే..
స్నానం చేసి, హాల్లోకి వస్తుండగా నేలపై వెళ్తున్న ఓ బల్లిపై పొరపాటున కాలేసి జారి పడ్డారని, తల గోడకు బలంగా తాకడంతో గాయపడి చనిపోయారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చనిపోయిన బల్లి.. కాలు జారిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. వైద్య సాయం అందక అపస్మారకస్థితికి చేరుకుని చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఫ్లాట్‌కు సెంట్రల్‌లాక్‌ సిస్టం ఉండటంతో బయటి నుంచి చూస్తే తలుపు తాళం వేసినట్లుగానే ఉండేది. దీనికి తోడు యజమానులు అమెరికాలో ఉంటారనే సంగతి అక్కడి ఫ్లాట్లలో ఉన్నవారికి తెలియడంతో ఎవ్వరూ పట్టించుకోలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.