యాప్నగరం

దేశంలో ప్రస్తుతం ఆ రెండింటి కోసమే పోరాటం.. పూనమ్!

ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్, నటి పూనమ్ కౌర్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతోపాటు మీడియాపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Samayam Telugu 16 Apr 2018, 9:46 am
ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్, నటి పూనమ్ కౌర్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతోపాటు మీడియాపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మీడియా తప్పుడు కథనాలను రాయడానికి ఆసక్తి చూపుతుందంటూ వ్యాఖ్యానించారు. అలాగే దేశంలో ప్రస్తుతం రెండింటి కోసమే పోరాటాలు జరుగుతున్నాయని, అందులో ఒకటి ఓటు కోసం, రెండోది నోటు కోసమని ఆరోపించారు. ఈ రెండూ తప్ప మరి దేని గురించి ఎవరూ మాట్లాడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం, సంస్కృతి గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యారన్నారు.
Samayam Telugu నటి పూనమ్ కౌర్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన పూనమ్, ఆయన వల్లే తాను ‘నిఫ్ట్’ లాంటి విద్యాసంస్థలో చదువుకోగలిగానని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. చంద్రబాబు అంటే తనకు ఎంతో గౌరవమని, హైదరాబాద్‌కు ఉన్నత విద్యాసంస్థలను తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని పూనమ్ కొనియాడారు. మీడియాపై కూడా ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఎప్పుడూ టీఆర్పీ రేటింగ్‌ల కోసమే పాకులాడుతూ, తప్పుడు వార్తలు రాయడానికి చూపుతున్న శ్రద్ధ.. ప్రజలకు ఉపయోగపడే వార్తలపై పెట్టడం లేదని దుయ్యబట్టారు.

చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా, స్వచ్ఛంద సేవకురాలిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను, విశ్వసుందరి మానుషి చిల్లార్‌ను కలిసినా పట్టించుకోని మీడియా, తనపై తప్పుడు వార్తలు రాసేందుకు మాత్రం ఉత్సాహం చూపుతోందని మండిపడ్డారు. కశ్మీర్ వరదలు, విశాఖపట్టణంలో హుద్‌హుద్ లాంటి ప్రకృతి విధ్వంసాలపై విరాళాల కోసం స్వచ్ఛందంగా పనిచేశానని, అయినా అప్పుడు ఒక్క వార్త కూడా మీడియాలో రాలేదన్నారు. కానీ, నకిలీ వార్తలపై మీడియాలో చర్చోపచర్చలు జరుగుతాయని, అతిలోక సుందరి శ్రీదేవి చనిపోతే ఎన్నో కల్పిత వార్తలు రాశారని పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.