యాప్నగరం

టీడీపీ నేతలతో విబేధిస్తున్న అఖిలప్రియ!

నంద్యాల్లో ఆయన ప్రభావం లేదనేది ఆమె మాట..

TNN 18 Aug 2017, 11:01 am
ఒకవైపు గంగుల ప్రతాపరెడ్డి చేరికతో నంద్యాల్లో తెలుగుదేశం పార్టీ అవకాశాలు మెరుగవుతాయని.. ఆ పార్టీ నేతలు, అభిమానులు చెబుతుంటే, మంత్రి అఖిలప్రియ మాత్రం మరోలా మాట్లాడారు. ప్రతాపరెడ్డి చేరిక వల్ల కొత్తగా ఒరిగేదేమీ లేదని అఖిల తేల్చేయడం గమనార్హం. ఆ మాజీ ఎంపీ చేరికతో అద్భుతాలు ఏమీ జరగవని అఖిల విశ్లేషించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి తరఫున అంతా తానై పనిచేస్తున్న అఖిల ఇలా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా ఉంది.
Samayam Telugu akhila differs with tdp leaders on gangula joining
టీడీపీ నేతలతో విబేధిస్తున్న అఖిలప్రియ!


మాజీ ఎంపీ చేరిక వల్ల తమ విజయావకాశాలు మరింత మెరుగయ్యాయని తెలుగుదేశం నేతలు చెబుతున్న వేళ అఖిలప్రియ మాత్రం ‘అబ్బే.. ఆయన వల్ల అదనపు ఉపయోగం ఏమీ లేదు..’ అని తేల్చి చెప్పారు. మరి పార్టీలోకి చేరి వచ్చిన నేత పట్ల అఖిల ఇలా ఎందుకు మాట్లాడిందో వేరే వివరించనక్కర్లేదు. గంగుల కుటుంబంతో భూమా కుటుంబానికి ఆది నుంచి రాజకీయ వైరుధ్యాలున్నాయి. గంగుల కుటుంబం కాంగ్రెస్ లో ఉంటే, భూమా కుటుంబం తెలుగుదేశంలో పని చేసింది.

భూమా కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళితే.. గంగుల ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. భూమా కుటుంబం టీడీపీలోకి వెళ్లగానే గంగుల ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ లోనే మిగిలిపోయిన గంగుల ప్రతాపరెడ్డి ఇప్పుడు తెలుగుదేశంలోకి చేరారు. దీంతో..భూమా కుటుంబీకులు అసహనంతో కనిపిస్తున్నారు. ఈ అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ప్రతాపరెడ్డి చేరితో ప్రయోజనం లేదని మంత్రి అఖిల తేల్చి చెప్పారు.

అంతే కాదు.. ప్రతాపరెడ్డి చేరిక వల్ల టీడీపీలో తమ అనుచర వర్గానికి ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారామె. కానీ ఎవరు చేరినా, తన అనుచర వర్గాన్ని తను కాపాడుకుంటానని అఖిల విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తానికి ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ ఈ రాజకీయం ఆసక్తిదాయకంగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.