యాప్నగరం

జగన్ పాదయాత్రపై జగడం..!

పాదయాత్రకు అనుమతి తప్పనిసరి అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశారని.. అప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు?

TNN 3 Nov 2017, 7:58 am
ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న సుదీర్ఘ పాదయాత్ర విషయంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య జగడం కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. అల్లర్లు జరగవచ్చు.. అని వ్యాఖ్యానించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండి పడుతోంది. ఇది వరకూ కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా తునిలో రైలు తగలబెట్టిన ఉదంతాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. జగన్ పాదయాత్ర సమయంలో కూడా అలాంటివి జరగవచ్చు అంటూ బాబు వ్యాఖ్యానించడం వివాదాన్ని రేపింది. తుని సంఘటనకూ, తమకూ ఏం సబంధం? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబుపై ప్రతిదాడి మొదలుపెట్టింది.
Samayam Telugu all set for ys jagan reddy padayatra
జగన్ పాదయాత్రపై జగడం..!


చంద్రబాబు నాయుడే అల్లర్లను సృష్టిస్తాడేమో అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రక్షణ కల్పించాలని, పాదయాత్ర నేపథ్యంలో జగన్ కు, యాత్రలో పాల్గొనే వైకాపా శ్రేణులకు రక్షణ కల్పించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డీజీపీ సాంబశివరావును కోరారు. ఈ మేరకు లేఖ రాసినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు పాదయాత్రకు అనుమతి తప్పనిసరి అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశారని.. అప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ రచ్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్తున్నారు. నేటి సాయంత్రం జగన్ తిరుపతి చేరుకుంటారని, కాలి నడకన శ్రీవారి దర్శనానికి వెళ్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.