యాప్నగరం

సమ్మక్క-సారలమ్మ వన ప్రవేశం.. మేడారం జాతర పరిపూర్ణం

దక్షిణాది కుంభమేళా మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర పరిపూర్ణమైంది. అమ్మల వనప్రవేశంతో జాతర ముగిసింది.

TNN 3 Feb 2018, 8:11 pm
దక్షిణాది కుంభమేళా మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర పరిపూర్ణమైంది. అమ్మల వనప్రవేశంతో జాతర ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన గిరిజన ఆరాధ్య దేవతలను శనివారం (ఫిబ్రవరి 3) సాయంత్రం పూజారులు సంప్రదాయ వాయిద్యాల మధ్య వన ప్రవేశం చేయించారు. సమ్మక్క తల్లిని చిలకగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పూనుగొండకు, గోవిందరాజును కొండాయికి తీసుకెళ్లారు. అమ్మలు వనప్రవేశం చేస్తుంటే కొంత మంది భక్తులు భక్తి పారవశ్యంతో ఊగిపోగా.. మరికొంత మంది భావోద్వేగంతో కంటతడి పెట్టడం కనిపించింది.
Samayam Telugu ammavarlu vana pravesham
సమ్మక్క-సారలమ్మ వన ప్రవేశం.. మేడారం జాతర పరిపూర్ణం


గురువారం సమ్మక్క తల్లిని వనం నుంచి తీసుకొచ్చిన తర్వాత గద్దెలపై కొలువుదీరిన వన దేవతలను దర్శించుకొని తరించడానికి శుక్ర, శని వారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చివరి రోజైన శనివారం మేడారం మరింత జనసంద్రంగా మారింది. అమ్మవార్ల వనప్రవేశ ఘట్టాన్ని కళ్లారా వీక్షించడానికి భక్తులు పోటెత్తారు.

మేడారం జాతరకు ఈసారి 1.25 కోట్ల మంది భక్తులు వచ్చారని అధికారులు తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌ తదితరులు ఈసారి అమ్మవార్లను దర్శించుకున్న ప్రముఖుల్లో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. మేడారంలోనే ఉండి జాతరను నిరంతరం పర్యవేక్షించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, తెలంగాణ రాష్ట్ర పండగ.. సమ్మక్క-సారక్క జాతరకు ప్రభుత్వం ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు గొప్పగా చేసింది. దీంతో ఊహించినదాని కంటే ఎక్కువగా మేడారానికి భక్తులు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చినప్పటికీ ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా జాతర విజయవంతంగా పూర్తవడం పట్ల కడియం శ్రీహరితో పాటు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

జాతర ప్రారంభానికి 20 రోజుల ముందు నుంచే మేడారానికి భక్తులు తరలివచ్చారు. భక్తితో నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించి అమ్మల ఆశీర్వాదం తీసుకున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి తరించారు. వనమంతా జనసంద్రంగా మారినా.. సమ్మక్క సారలమ్మ తల్లుల చల్లని దయ వల్లే ‘మేడారం జాతర’ విజయవంతమైందని కడియం శ్రీహరి అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.