యాప్నగరం

అంపశయ్య నవీన్‌కు కాళోజీ పురస్కారం

నవీన్‌కు గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. ‘కాలరేఖలు’ నవలకు గాను 2004లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

Samayam Telugu 8 Sep 2018, 8:58 am
‘ప్రజాకవి’ కాళోజీ నారాయణరావు పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏటా అందించే ప్రతిష్ఠాత్మక కాళోజీ పురస్కారం ఈసారి ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు దక్కింది. రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ సాహితీ పురస్కారాన్ని ఏటా అందిస్తున్నారు. ఈ ఏడాది అంపశయ్య నవీన్‌ను ఎంపిక చేశారు. కాళోజీ 104వ జయంతి సందర్భంగా ఈనెల 9వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే వేడుకలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని నవీన్‌కు అందించనున్నారు. అవార్డు కింద లక్షా 116 రూపాయల నగదు బహుమతి అందనుంది.
Samayam Telugu naveen


కాగా, నవీన్‌కు గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. ‘కాలరేఖలు’ నవలకు గాను 2004లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా కూడా ఆయన వ్యవహరించారు. 1941లో వరంగల్‌ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో నవీన్ జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎకనామిక్స్ పూర్తిచేశారు. నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌లలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. వరంగల్ మహిళా డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.

2004లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. నవీన్ సుమారు 30 నవలలు, 10 కథలు రచించారు. తొలి నవల ‘అంపశయ్య’ ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అదే ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన రాసిన నవలల్లో అంపశయ్య, కాల రేఖలు, చీకటి రోజులు ప్రముఖమైనవి. అలాగే కథల్లో చెర, బలి, దాడి ప్రధానమైనవి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.