యాప్నగరం

నేడు ఏపీ క్యాబినెట్ తొలి భేటీ.. ప్రధాన అజెండా ఇదే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయి క్యాబినెట్ ఏర్పాటుచేసి, ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలను ఈ పదవులను కట్టబెట్టారు.

Samayam Telugu 10 Jun 2019, 8:02 am
ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల కిందట క్యాబినెట్ కొలువుదీరిన విషయం తెలిసిందే. జగన్ మంత్రిమండలి తొలి సమావేశం సోమవారం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో జరగబోయే ఈ సమావేశంలో 8 అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కేబినెట్‌ సమావేశంలో చర్చించే అంశాలను సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయా శాఖల నుంచి సమాచారాన్ని తెప్పించారు. ఎన్నికల సమయంలో సామాజిక పింఛన్లను రూ.3వేల వరకూ పెంచుకుంటూ పోతామని జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.250 పెంచుతూ తన ప్రమాణస్వీకారం రోజునే జగన్ తొలి సంతకం చేశారు. దీనికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.
Samayam Telugu ysrcp-ministers


అలాగే ఆశా వర్కర్లకు వేతనాన్ని రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంపు, అక్టోబరు నుంచి అమలు చేయనున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకం, ఉద్యోగులకు మధ్యంతర భృతికి సంబంధించిన దస్త్రాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. వీటితోపాటు ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, హోంగార్డుల వేతనాల పెంపు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుపై కేబినెట్‌లో ఈ చర్చించనున్నారు. చర్చించిన తర్వాత వీటిపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వీటితోపాటు మరికొన్ని అంశాలూ చర్చకు వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తికావడంతో వారికి పేషీల ఏర్పాటుపై సాధారణ పరిపాలన శాఖ దృష్టిసారించింది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో ఉన్న పురపాలకశాఖ మంత్రి పేషీని పరిశీలించారు. పేషీని, పురపాలక శాఖ కమాండ్‌ కంట్రోల్‌ రూంను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే దేవాదాయ, విద్యాశాఖ మంత్రుల పేషీలను దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అనుచరులు పరిశీలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.