యాప్నగరం

TTD JEOగా ధర్మారెడ్డి.. 9 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ, జగన్ రిక్వెస్ట్‌తో కేంద్రం నుంచి..

టీటీడీ జేఈవోగా ఏవీ ధర్మారెడ్డిని నియమిస్తూ.. ఏపీ సర్కారు జీవో జారీ చేసింది. 9 ఏళ్ల తర్వాత ఆయన టీటీడీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ధర్మారెడ్డి వైఎస్ సన్నిహితుడు.

Samayam Telugu 10 Jul 2019, 11:48 pm
టీటీడీ జేఈవో పదవిలో 8 ఏళ్లపాటు కొనసాగిన శ్రీనివాస రాజు స్థానంలో ప్రభుత్వం ధర్మారెడ్డిని నియమించింది. పి.బసంత్ కుమార్ ప్రస్తుతం అదనంగా ఈ బాధ్యతలను నిర్వరిస్తోంది. వైఎస్ హయాంలో టీటీడీలో పని చేసిన ధర్మారెడ్డి.. ఢిల్లీ నుంచి తిరిగి తిరుమల వస్తున్నారు. 2004 జూలై 5 నుంచి 2006 సెప్టెంబర్ 9 వరకు ఆయన టీటీడీ జేఈవోగా పనిచేశారు. 2008 ఏప్రిల్‌ 2 నుంచి 2010 ఆగస్టు 31 వరకూ ప్రత్యేక అధికారిగా పని చేశారు. కేంద్ర హోంశాఖలో కీలకమైన జాయింట్‌ సెక్రటరీ హోదాలో పనిచేస్తోన్న ధర్మారెడ్డిని డిప్యూటేషన్‌పై తీసుకొచ్చి టీటీడీ జేఈవోగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Samayam Telugu dharma reddy


టీటీడీలో జేఈవో పోస్ట్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం, ఆర్జిత సేవా టికెట్లు కేటాయించే అధికారాలు జేఈవోకు ఉంటాయి. రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు జేఈవోతో సన్నిహితంగా మెలగాలని భావిస్తారు. జేఈవో పోస్టులో శ్రీనివాసరాజు 8 ఏళ్లపాటు కొనసాగారు. రోశయ్య హయాంలో ఈ పదవిలో చేరిన ఆయన.. సీఎంలు మారినా.. ఆ పదవిలోనే కొనసాగారు. కానీ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో.. ఆయనకు స్థాన చలనమైంది.

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత స్పెషల్ ఆఫీసర్‌గా టీటీడీలోకి ఏవీ ధర్మారెడ్డి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. టికెట్ స్కాంలో ఆలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడంతో.. 2010లో ఆయనపై బదిలీ వేటు పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.