యాప్నగరం

చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్!

కేంద్ర మంత్రులు రాజీనామాలు సమర్పించడానికి ముందుగానే చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్? తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో!

Samayam Telugu 8 Mar 2018, 5:29 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసిన తర్వాత.. రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర వైఖరిని నిరసిస్తూ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ-టీడీపీల మధ్య వాగ్యుద్ధం మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం చంద్రబాబుకు ఫోన్ చేయడంతో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
Samayam Telugu 63213550


జైట్లీ ప్రకటన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ విషయాన్ని చంద్రబాబు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము కేంద్ర ప్రభుత్వ పదవుల నుంచి తప్పుకుంటున్నామంటూ చంద్రబాబు ప్రకటించారు. దీంతో బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రులు సైతం తమ రాజీనామాలను సమర్పించారు.

టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు అశోక గజపతి రాజు, సుజనా చౌదరీలు గురువారం ప్రధాని మోదీని కలిసి రాజీనామాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే, ఈలోగానే ప్రధాని.. చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడటం గమనార్హం. ప్రధాని దాదాపు 10 నిమిషాల పాటు చంద్రబాబుతో మాట్లాడినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా రాజీనామా నిర్ణయం వెనుక కారణాల గురించి చంద్రబాబు ఆయనకు వివరించినట్లు సమాచారం. ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధాని ఢిల్లీకి చేరగానే.. సుజనా చౌదరీ, అశోక గజపతి రాజు రాజీనామాలు సమర్పించనున్నారు. అయితే, సీఎం - ప్రధానిలు ఫోన్లో మాట్లాడుకున్న నేపథ్యంలో మళ్లీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆసక్తి నెలకొంది.
Read this story in English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.