యాప్నగరం

‘ఏపీ అభివృద్ధి చెందేవరకు కేంద్రం చేయూతనివ్వాల్సిందే’

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.

TNN 5 Mar 2018, 10:27 am
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీ అభివృద్ధి చెందేవరకు కేంద్రం సహాయం చేయాల్సి ఉందని అన్నారు. 58 శాతం జనభాకు 46 శాతం రాబడి ఇవ్వడం అన్యాయమని నరసింహన్ పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ హామీలు అమలు కావాలని, విభజన చట్టంలోని హామీలపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోందని, కొత్త రాష్ట్రానికి రాజధాని లేదని, ప్రధాన ఆర్థిక వనరు కోల్పోయామని తెలిపారు. 9, 10 షెడ్యూల్ ప్రకారం ఆస్తుల పంపిణీ జరగాలని, వెనుకబడి జిల్లాల అభివృద్ధికి కేంద్రం మరిన్ని నిధులు ఇవ్వాలని గవర్నర్ తన ప్రసంగంలో డిమాండ్ చేశారు.
Samayam Telugu ap budget session 2018 begin governor narasimhan addressed at assembly
‘ఏపీ అభివృద్ధి చెందేవరకు కేంద్రం చేయూతనివ్వాల్సిందే’


కేంద్ర నిధులతో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాని ఏర్పాటుచేయాల్సి ఉందని తెలియజేశారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించామని, వ్యవసాయ రంగంలో గణనీయమైన వృద్ధి సాధించామని తెలిపారు. రెవెన్యూ లోటు, తక్కువ ఆదాయం, ఆస్తులు పంపిణీ చేపట్టక పోవడం లాంటి కారణాలతో కొత్త రాష్ట్రానికి కష్టాలు మరింత పెరిగాయని అన్నారు. మూడేళ్లలో 11.31 శాతం వృద్ధి రేటును సాధించామని చెప్పారు. విభజన హామీలను అమలు చేయాలన్న ఏపీ ప్రజల ఆకాంక్షలను కేంద్రానికి తెలియజేస్తున్నామని అన్నారు.

విభజన చట్టంలోని ఎన్నో హామీలు అమలు కావాల్సి ఉందని వెల్లడించిన ఆయన, విభజన గాయాల నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని అన్నారు. విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పారు. ఆస్తులను ప్రాంతాల వారీగా, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం మూడున్నరేళ్లుగా హామీల అమలు కోసం ప్రయత్నం సాగిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజల్లో ఎంతో అసంతృప్తి నెలకొని ఉందని, అది తొలగాలంటే, కేంద్రం చొరవ చూపించాల్సిందేనని నరసింహన్ స్పష్టం చేశారు.

గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. మార్చి 29 వరకూ మొత్తం 18 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. బీఏసీ సమావేశంలో దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 8 న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత సమావేశాలకు హాజరుకావడంలేదని వైకాపా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో చర్చించేందుకు గాను మొత్తం 29 అంశాల్ని తెదేపా శాసనసభాపక్షం ఎంపిక చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.