యాప్నగరం

ఒకటి లోకేష్ కు.. మిగతా ఐదు దక్కేదెవరికి..?!

కుల, సామాజిక, రాజకీయ సమీకరణాలను ఆయన ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి!

TNN 31 Mar 2017, 12:28 pm
ఒకవైపు పార్టీలోకి కొత్తగా వచ్చి చేరిన వారు... మరో వైపు పాత కాపులు... ఇంకో వైపు పదవులను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్లు.. ఏపీ కేబినెట్ విస్తరణకు ముందు తెలుగుదేశం పార్టీలో ఈ పరిస్థితి నెలకొని ఉంది. వైకాపా నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల్లో కొందరు మంత్రి పదవుల మీద గంపెడాశతో ఉన్నారు. బాబు తమకు హామీ ఇచ్చారని, పదవి వస్తుందని వారు బయట చెప్పుకుంటున్నారు.
Samayam Telugu ap cabinet reshuffle generates curiosity
ఒకటి లోకేష్ కు.. మిగతా ఐదు దక్కేదెవరికి..?!


ఇక తెలుగుదేశం పార్టీలోని సీనియర్లున్నారు... పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లూ తాము పోరాడామని, పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా తమకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం ఏమిటనేది వారి వాదన.. ఈ జాబితాలో టీడీపీ సీనియర్లు పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి ఎమ్మెల్సీలున్నారు.

మరోవైపు మూడేళ్ల నుంచి మంత్రి పదవుల్లో ఉంటూ.. తమను మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని కోరుకుంటున్న వాళ్లు.. ప్రస్తుతం బాబుతో సహా మొత్తం 20 మంది మంత్రులున్నారు ఏపీ కేబినెట్లో. ఈ సంఖ్యను 26 వరకూ పెంచుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఆరు పదవులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి లోకేష్ కు ఫిక్సయ్యింది. మిగిలిన ఐదు పదవులు ఎవరికి? అనేదే తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఆశావహుల జాబితాను చూస్తే అది చాలా పెద్దగా ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో జలీల్ ఖాన్, భూమా అఖిలప్రియ, సుజయ రంగారావు, జ్యోతుల నెహ్రూలు మంత్రి పదవి మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అయితే వీరిలో ఎవరికి పదవిని ఇచ్చినా టీడీపీ ఇరకాటంలో పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యే తలసానికి మంత్రి పదవి ఇచ్చినందుకు కేసీఆర్ సర్కారుపై, ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ పై దుమ్మెత్తి పోసింది టీడీపీ. మరి ఇప్పుడు ఏపీలో అదే పని చేస్తే తెలుగుదేశం ఇరకాటంలో పడుతుంది. ప్రతిపక్షానికి అవకాశం దక్కుతుంది.

అలాగని.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకపోతే.. వారిలో అసంతృప్తి మొదలయ్యే అవకాశాలు లేకపోలేదు. ప్రత్యేకించి భూమా మరణం నేపథ్యంలో అఖిలప్రియకు అవకాశం ఇవ్వవచ్చు. అఖిలప్రియకు ఇస్తే మాకెందుకు ఇవ్వరని ఫిరాయించిన ఇతర ఎమ్మెల్యేలు ప్రశ్నించే అవకాశం ఉంది.



ఇక పార్టీ పాత కాపుల్లో చాలా మంది ఛాన్స్ కావాలని అంటున్నారు. తనకు కేబినెట్ మినిస్టర్ పోస్టు ఇవ్వాల్సిందేనని సోమిరెడ్డి స్పష్టం చేశారట. మండలి చైర్మన్ హోదా కూడా వద్దు.. మంత్రి పదవి కావాల్సిందేనని సోమిరెడ్డి అంటున్నారట. అలాగే పయ్యావుల కేశవ్ కూడా ఇదే డిమాండ్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరు మాత్రమే గాక.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్లు కూడా మంత్రి వర్గ విస్తరణలో ఛాన్స్ ఇవ్వాలని బాబు ను కోరుతున్నారు.

ఇక కొందరిని మంత్రి వర్గం నుంచి తప్పించవచ్చనే మాట కూడా వినిపిస్తోంది. పీతల సుజాత, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల పేర్లు తొలగింపు జాబితాలో వినిపిస్తున్నాయి. అయితే వీరు కూడా పదవిని నిలబెట్టుకోవడానికి తమవంతు యత్నాల్లో ఉన్నారు. పల్లె తొలగింపు ఉండకపోవచ్చని.. శాఖల కత్తిరింపు మాత్రమే ఖాయమనే మాట వినిపిస్తోంది. పీతల, బొజ్జల పదవులు మాత్రం పోవడం ఖాయమే అని తెలుగుదేశం వర్గాలంటున్నాయి.

ఏదేమైనా.. పరిమిత స్థాయిలో ఉన్న పదవులను చంద్రబాబు ఎవరికి పంచుతారు? అనేది ఆసక్తికరమైన అంశం. కుల, సామాజిక, రాజకీయ సమీకరణాలను ఆయన ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.