యాప్నగరం

నన్ను ఏదైనా చేయాలని చూస్తే అది వారికే తగులుతుంది: చంద్రబాబు

జల సంరక్షణపై ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేయించారు. అవుకు జలాశయం వద్ద జలహారతి ఇచ్చిన చంద్రబాబు, వైసీపీ, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.

Samayam Telugu 23 Sep 2018, 8:32 am
ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, బీజేపీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం కర్నూలు జిల్లాలో అవుకు టన్నెల్‌, గోరుకల్లు జలాశయం, పులికనుమ ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. వైసీపీ తీరును ఎండగట్టారు. ప్రతిపక్షం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా జీతాలు తీసుకుంటారని దుయ్యబట్టారు. చట్ట సభలో తమ సమస్యలపై చర్చించడానికి ఓట్లువేసి గెలిపిస్తే, వారు సభకు రాకుండా బీజేపీతో లాలూచీ పడి మోదీకి భయపడి ఊడిగం చేసే పరిస్థితికి ప్రతిపక్షం వచ్చిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై తాము ప్రతిచోటా పోరాడుతుంటే వైసీపీ నేతల మాత్రం మోదీకి సహకరిస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై విమర్శలు చేసే ఆ పార్టీ నేతలను ప్రధానిని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.
Samayam Telugu ఏపీ సీఎం చంద్రబాబు


నరేంద్ర మోదీ చెప్పడంతోనే రిలయన్స్‌‌కు రాఫెల్‌ ఒప్పందం ఇప్పించామని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు స్పష్టంగా చెప్పడంతో ఈ విషయంలో మోదీ చెప్పినవన్నీ మాటలు అబద్ధాలని తేలిపోయాయి.. ఆయన జాతికి క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 57 ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని, ఇప్పటికే 15 ప్రాజెక్టులను ప్రారంభించామని, మిగిలినవీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాయలసీమలో కరవుపై ప్రణాళికలు వేశామని, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడానికి పిలుపినిస్తే 10 లక్షల పంట కుంటలు తవ్వడం, లక్ష చెక్‌డ్యాంలు నిర్మాణం ఓ చరిత్రని అన్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నదులను అనుసంధానం చేసి మహా సంగమానికి శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. తానెప్పుడూ నీతి నిజాయతీతో ఉన్నానని, తనను ఏదైనా చేయాలని చూస్తే అది వారికే శాపంగా మారుతుంది తప్ప నాకేమీ జరగదని ఉద్ఘాటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.