యాప్నగరం

పోలవరం ప్రాజెక్టులో మరో మైలురాయి.. స్పిల్‌వే గ్యాలరీని ప్రారంభించిన బాబు

నదుల అనుసంధాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి, ఎన్నో సంచలనాలకు, రికార్డులకు వేదికైన పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మరో అధ్యాయానికి బుధవారం శ్రీకారం చుట్టారు.

Samayam Telugu 12 Sep 2018, 12:22 pm
ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మరో మైలురాయికి బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు స్పిల్‌వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి ఆయన గ్యాలరీలో నడిచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు సైతం పాల్గొన్నారు. అంతకు ముందుకు కుటుంబ సమేతంగా అమరావతి నుంచి హెలికాప్టర్‌లో పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం, గ్యాలరీ పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన పైలాన్‌ను ఆవిష్కరించి ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో సీఎం మనవడు, మంత్రి లోకేశ్ తనయుడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాడు. ప్రాజెక్టు వద్ద హుషారుగా తిరుగుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ముందుండి నడవడటం విశేషం.
Samayam Telugu పోలవరం ప్రాజెక్టు


మరోవైపు గ్యాలరీలో నడక సంక్లిష్టమైంది కావడంతో అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలో వైద్య బృందాలు, ఆక్సిజన్‌ సిలిండర్లు, అత్యవసరమైతే తరలించేందుకు అంబులెన్సులు సిద్ధం చేశారు. దాదాపు రెండు వేల మంది పోలీసులను మొహరించారు. అదనంగా మరో వెయ్యి మంది గ్రేహౌండ్స్‌, సీఆర్‌ఫీఎఫ్‌ దళాలు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు, తూర్పుగోదావరి జిల్లా వైపున ఉన్న అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహించాయి.
పోలవరం ప్రాజెక్టు పరిసరాలను పోలీసులు మంగళవారమే స్వాధీనంలోకి తీసుకుని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సీఎం భద్రతను 11 సెక్టార్లుగా విభజించి అటు ప్రజలు.. ఇటు ప్రజాప్రతినిధుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవహరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.