యాప్నగరం

కేసీఆర్ వస్తే అంత అతి ఎందుకు: చంద్రబాబు సీరియస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు.

TNN 11 Oct 2017, 9:23 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. అత్యుత్సాహంతో పొరపాట్లు చేసి పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరించడం సరికాదని స్పష్టం చేశారు. సీనియర్లు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించడమేంటని అసహనం వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌పై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Samayam Telugu ap cm chandrababu naidu warns party leaders
కేసీఆర్ వస్తే అంత అతి ఎందుకు: చంద్రబాబు సీరియస్


మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహానికి కేసీఆర్‌ వచ్చినప్పుడు పార్టీ నాయకులు కొందరు అతిగా ప్రవర్తించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో పయ్యావుల కేశవ్‌ ఏకాంతంగా సమావేశమవడం వంటివి తప్పుడు సంకేతాలిచ్చాయన్నారు. దాని వల్ల తెలంగాణలో తెదేపాకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని మండిపడ్డారు. తెలంగాణ నాయకులు రాజీనామాలు చేస్తామని, తమ దారి తాము చూసుకుంటామని అంటున్నారన్నారు. మంగళవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రులు, ముఖ్య నాయకులతో చంద్రబాబు పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

‘కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన వచ్చినప్పుడు మర్యాదగా ఆహ్వానించడం.. వీడ్కోలు పలకడం మన బాధ్యత. మనం అంతవరకే ఉండాలి. నేను కూడా ఆయన వచ్చే సమయానికి పలకరించి వెళ్లిపోయేలా ప్రణాళిక వేసుకున్నాను. పార్టీ నాయకులు కొందరు ఆయన చుట్టూ చక్కర్లు కొట్టారు. అంత అవసరం ఏమొచ్చింది? కేసీఆర్‌తో కేశవ్‌ ఏకాంతంగా సమావేశమయ్యారంటూ టీవీ ఛానళ్లలో ఊదరగొట్టారు. సీనియర్‌ నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనే ఇలా చేస్తే ఎలా? తెలంగాణలో తెదేపా ఉందని, ఇలాంటి చర్యల వల్ల పార్టీకి ఇబ్బంది ఏర్పడుతుందని మర్చిపోతే ఎలా?’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.