యాప్నగరం

కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ టార్గెట్ మనమే: బాబు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్రంపై పోరాటం చేస్తోన్న ఏపీ ప్రభుత్వం, ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై రెండోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

Samayam Telugu 8 Apr 2018, 9:04 am
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్రంపై పోరాటం చేస్తోన్న ఏపీ ప్రభుత్వం, ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై రెండోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన పార్టీలు వైసీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు హాజరు కాలేదు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షత శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆప్, లోక్‌సత్తా, సమతాపార్టీ, ఫార్వర్డ్ బ్లాక్ లాంటి పార్టీలతోపాటు ఉద్యోగ, ప్రజా, విద్యార్థి, పాత్రికేయ సంఘాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... కర్ణాటక శాసనసభ ఎన్నికలు ముగియగానే బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్‌‌ను లక్ష్యంగా చేసుకుంటారని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలన్నదే తన ఉద్దేశమన్న చంద్రబాబు, మనకు నష్టం కలిగించాలని బీజేపీ నేతలు భావిస్తే, నైతికంగా బలంగా ఉన్న మనతో పెట్టుకుంటే వాళ్లే నష్టపోతారని పరోక్షంగా హెచ్చరించారు.
Samayam Telugu అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు


గతంలోనూ ఎన్నో పోరాటాలు చేశానని, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే స్థైర్యం ఉందని, విజయం సాధించే వరకూ రాజీపడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధులను విడుదల చేయకుండా కేంద్రం ఓ దస్త్రాన్ని తొక్కి పెట్టిందని ఆయన ఆరోపించారు. బీజేపీ, వైసీపీలు లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని, జగన్ ఉచ్చులో ఎవరూ పడొద్దని సమావేశానికి హాజరైన వివిధ సంఘాల ప్రతినిధులకు బాబు సూచించారు. ముసుగు వీరులను చూసుకునే బీజేపీ పెద్దలు రాష్ట్రంతో ఆడుకోవాలని భావిస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వబోనని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడదని అన్నారు. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలు, ప్రతిపక్షాలను పాములు, కుక్కలతో పోల్చుతూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్న మాటలపై కూడా బాబు మండిపడ్డారు. ఇలాంటి అభ్యంతరకమైన పదజాలాన్ని జాతీయ స్థాయిలో ఏ నేత కూడా ఇంతవరకూ వాడలేదని అన్నారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని, తనను బావిలో పడి చావాలని ప్రతిపక్ష నేత అన్న మాటలు చాలా దుర‌దృష్ట‌కరమని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.