యాప్నగరం

కరుణానిధి మృతికి తెలుగు సీఎంల సంతాపం

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Samayam Telugu 7 Aug 2018, 8:30 pm
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తాను నమ్మిన సిద్ధాంతాలను నిజ జీవితంలో ఆచరించిన వ్యక్తి కరుణానిధి అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. కరుణానిధి మరణవార్త తెలుసుకుని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు. కరుణానిధి జీవిత కాలం తమిళనాట ఆయన శకంగా మిగిలిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు, డీఎంకే కార్యకర్తలకు, తమిళ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.
Samayam Telugu Karuna_Tribute

కరుణానిధి మృతి తమిళనాడుకే కాకుండా యావత్ భారతదేశానికి తీరనిలోటని ఏపీ సీఎం అభిప్రాయపడ్డారు. నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన నిత్యం పరితపించారన్నారు. 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13సార్లు శాసనసభ్యునిగా, 50 ఏళ్ళు పార్టీ అధ్యక్షునిగా.. 75 ఏళ్ల ఆయన రాజకీయ జీవితం అందరికీ ఆదర్శమని, మార్గదర్శకమని ప్రశంసించారు.

మరోవైపు, కరుణానిధి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత రాజకీయ రంగానికి కరుణానిధి మృతి తీరని లోటన్నారు. కరుణానిధి తమిళ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీక అని కొనియాడారు. భారత రాజకీయాల్లో అత్యంత క్రియాశీల నాయకుడిగా దశాబ్దాల తరబడి సేవలందించారని ప్రశంసించారు. అలాగే, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా కరుణానిధి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.