యాప్నగరం

దివిసీమకు శాపంలా మారిన పాము కాట్లు.. స్పందించిన జగన్

పాముకాటు బాధితులకు చికిత్స అందిస్తూ చేతులు దులుపుకుంటున్నారే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆలోచన చేయడంలేదు. విషసర్పాలపై అవగాహన కల్పించాలి.

Samayam Telugu 19 Jul 2019, 1:28 pm
దివిసీమలో మళ్లీ విషసర్పాలు పడగవిప్పుతున్నాయి. గతేడాది మొత్తం 320 మంది పాముకాటుకు గురికాగా, పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రెండు రోజుల వ్యవధిలోనే అవనిగడ్డ ప్రాంతంలో పది మంది పాము కాటుకు గురయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. తక్షణమే ఆ ప్రాంతానికి వెళ్లాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఇంతియాజ్ హుటాహుటిన అవనిగడ్డకు వెళ్లి పాము కాటుతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ... పాము కాటుకు గురైన వారికి తక్షణమే చికిత్సకు అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Samayam Telugu pjimage (45)


రాష్ట్రంలో ఎక్కడా లేని దివిసీమలో పాముల భయం ఎక్కువగా ఉంటుంది. ఏటా పొలాల్లో నాట్లు వేసే సమయంలో పాములు బయటకి వస్తుంటాయి. పొలాల్లోకి వెళ్లిన రైతుల్నే కాదు ఇళ్లలోకి కూడా చొరబడి కాటువేస్తున్నాయి. టా పదుల సంఖ్యలో పాముకాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వరి నాట్లు వేసే సమయంలో సాధారణంగా నీళ్ల పాములు వస్తుంటాయి. అవి కాటువేసినా విషం ఉండదు కాబట్టి ఎలాంటి ప్రాణాపాయం ఉండదు. కానీ ప్రస్తుతం విషపూరితమైన కట్ల పాములు, రక్త పింజెరిలు కాటువేయడంతో వెంటనే ప్రాణం పోతోంది. ఇది దివిసీమకు ఒక శాపంలా పరిణమించింది. వీటి నియంత్రణకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

అసలు ఇక్కడ మాత్రమే ఈ సమస్య ఉందని తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. పాము కాటుతో జనం చనిపోయినప్పుడు ఏదో నాలుగు రోజులు హడావిడి చేయడం తప్ప చర్యలు మాత్రం శూన్యం. ఎక్కడాలేని విధంగా కేవలం దివిసీమలోనే పాముకాటు కేసులు అధికంగా నమోదుకావడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో పొలాలకు నీరుపెట్టడానికి రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లే రైతులు, ఈ సంఘటనలతో రాత్రివేళ వెళ్లడానికి వెనుకడుగు వేస్తున్నారు. వ్యవసాయ కూలీలు పొలంపనులు చేసుకునే సమయంలో ఎక్కడ ఎలాంటి పాములబారినపడాల్సి వస్తుందోనని భిక్కుబిక్కుమంటూ పనులు చేస్తున్నారు.

పాముకాటు కేసులు అధికంగా నమోదై ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నా వీటి నివారణకు తీసుకునే చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. వర్షాకాలం మొదలు కావడంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా పాముల సంచారం పెరుగుతుంది. అవి ఎప్పుడు, ఎవరిని కాటేస్తాయో తెలియని పరిస్థితి. ఏ పొదలో ఏ రకమైన పాముంటుందో ఎవరూ చెప్పలేరు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పాము కాటుకు గురికాక తప్పదు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.